తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన వ్యవహారంలో టిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివాదంలో వుండగానే, ఇప్పుడు ఏపీలోనూ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఇదే తరహ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.అంతేకాదు ఆయన పై ఏపీ సిఐడి కేసు కూడా నమోదు చేయడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు.
సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నేత గా కీలకంగా వ్యవహరించిన అశోక్ బాబు టిడిపి అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మారారు .ఆ తర్వాత ఆయన స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడంతో పాటు , టిడిపి అధినేత చంద్రబాబు ఆశీస్సులతో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీ గాను ఎంపికయ్యారు.అశోక్ బాబు డిగ్రీ సర్టిఫికేట్ ఫేక్ అని విమర్శలు రావడంతో పాటు , దానికి సంబంధించిన ఆధారాలు వెలుగులోకి రావడం తో ఆయన పై కేసు నమోదయింది . ఈ విషయం ఎప్పటి నుంచో నలుగుతూనే ఉంది.గతంలోనే అశోక్ బాబు విద్యార్హతల పై అనేక విమర్శలు వచ్చినా, అప్పటి టిడిపి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు.అయితే అశోక్ బాబు పనిచేసిన వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు చాలామంది ఈ వ్యవహారంపై ఫిర్యాదులు చేశారు.
అయితే ఇప్పుడు ఆయన పై 447 ఎ, 465, 420 సెక్షన్ ల కింద కేసులు నమోదయ్యాయి.ఆయన చదువు విషయంలో వివాదం ఏర్పడడానికి కారణం ఆయన డిప్లమో ఇన్ కంప్యూటర్స్ ను బీకాం గా మార్చి ఆ సర్టిఫికెట్ లతో పదోన్నతి పొందినట్లుగా ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
వాణిజ్యపన్నుల కమిషన్ కార్యాలయంలో ఉద్యోగం కోసమే ఆయన ఈ విధంగా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఉద్యోగ విరమణ సమయంలో తనపై ఎటువంటి కేసులు లేవని ప్రకటించినా, ఇప్పుడు మాత్రం ఆయనపై కేసులు వెలుగులోకి రావడం తో ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసే విషయంలో అశోక్ బాబు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.