బీజేపి ఏపీలో ఎంత పగడ్బందిగా రాజకీయం చేయాలని చూస్తున్నా, వర్కవుట్ అయితే కావడం లేదు.అందుకే ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకుని మరీ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది.
కానీ బీజేపీ ఏపీలో ఎదగకుండా మొదటి నుంచి టీడీపీ అడ్డం పడుతూనే వస్తోంది.టీడీపీ పై ఎంతగా రాజకీయ కక్ష తీర్చుకుందామని చూస్తున్నా, అది సాధ్యపడలేదు.
ముఖ్యంగా సోము వీర్రాజు ఏపి బీజేపి అధ్యక్షుడు అయిన తర్వాత టీడీపీని ఇరుకున పెట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.సూటిగా టీడీపీపై విమర్శలు చేస్తూ, మీడియాలోనూ వీర్రాజు హడావుడి చేశారు.
గతంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చంద్రబాబు వంటి వారు అనుచిత వ్యాఖ్యలు చేయడం, అలాగే అమిత్ షా తిరుపతి పర్యటన సందర్భంగా ఆయన కారుపై రాళ్ల దాడికి దిగడం ఒంటి వ్యవహారాల్లో ప్రతీకారం తీర్చుకునేందుకు బీజేపి ప్రయత్నిస్తూ వస్తున్నా, అది సాధ్యపడలేదు.
ఇప్పుడు చంద్రబాబుకి సిఐడి నోటీసు ఇవ్వడం, ఆ కేసులో ఆయన తప్పించుకునే అవకాశం లేకపోవడం, ఆయన అరెస్ట్ అవుతారంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపి ఖుషి గా ఉంది.
ఇదే విషయంపై ఏపీ బీజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.అమరావతి భూ వ్యవహారాల్లో లెక్కలేనంత అవినీతి జరిగిందని, తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
మూడు రాజధానులకు మద్దతు ఇస్తూనే అమరావతి ప్రాంత రైతులకు న్యాయం చేయాలని బిజెపి డిమాండ్ చేస్తూ వస్తోంది. చంద్రబాబుకు సీఐడీ నోటీసు ఇవ్వడంపై స్పందించనూ అంటూనే వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన సైతం ఈ వ్యవహారంలో సైలెంట్ గానే ఉంది.
గతంలో అమరావతి వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హడావుడి చేసినా, చంద్రబాబు కు నోటీసు ఇవ్వడంపై మౌనంగా ఉన్నారు.ఇక సిపిఐ రామకృష్ణ సైతం మౌనం పాటిస్తున్నారు.భూ అక్రమాలపై విచారణ చేస్తుంటే ఎందుకు అడ్డం పడుతున్నారనే ప్రశ్న తలెత్తకుండా వీరంతా సైలెంట్ అయిపోయినట్లు కనిపిస్తున్నారు.
ఇక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక్కరు మాత్రమే చంద్రబాబు నోటీసులపై స్పందిస్తూ, ఆయనకు మద్దతు ఇస్తున్నారు.వైసీపీ నాయకులతో పాటు బీజేపీ చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై చాలా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
చంద్రబాబుకు ఇదే తగిన శాస్తి అన్నట్లు ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారట.టీడీపీ ఎంత బలహీనపడితే బీజేపి, జనసేన కూటమి అంతగా బలపడుతుంది అనే లెక్కలు కమలనాథులు ఉన్నారట.