దక్షిణాది రాష్ట్రాల్లో బలపడేందుకు బీజేపీ వేస్తున్న ఎత్తుగడలు ప్రాంతీయ పార్టీలకు మింగుడుపడడంలేదు.ఒకపక్క ఏపీలో జగన్ పార్టీతో, తెలంగాణాలో కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే మరోవైపు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో బలపడేందుకు తెర వెనుక పావులు కదుపుతూ ముచ్చెమటలు పట్టిస్తోంది.
ఇప్పటికే ఏపీలో నలుగురు రాజ్యసభ సభ్యులను చేర్చుకున్న ఆ పార్టీ మిగతా తెలుగుదేశం ఎమ్యెల్యేలను కూడా పార్టీలో చేర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.వచ్చే ఎన్నికలనాటికి ఎలా అయినా తెలంగాణ, ఆంద్రప్రాంతాల్లో గట్టి పట్టు సాధించాలనే దృఢ నిశ్చయంతో ఉంది.
ఈ నేపథ్యంలోనే ఏపీలో పార్టని ముందుకు తీసుకెళ్లగలిగిన నాయకుడి కోసం ప్రయత్నిస్తోంది.దానిలో భాగంగానే జనసేన పార్టీ నాయకుడిగా ఉన్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ ను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోనే మెగా స్టార్ చిరంజీవి మీద బీజేపీ కన్నేసింది.
2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి, కేంద్ర సహాయ మంత్రి పదవితో సరిపెట్టుకున్న చిరంజీవి రాజకీయాల్లో తాను ఆశించిన ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోలేకపోయారు.తన పార్టీని విలీనం చేసుకున్న కాంగ్రెస్ కనీసం కేబినెట్ స్థాయి కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం చిరంజీవి అభిమానుల లో కూడా అసంతృప్తి చెలరేగింది.2018 ఏప్రిల్ లో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం కూడా ముగియడంతో అప్పటి నుంచి రాజకీయ కార్యకలాపాలకు చిరంజీవి దూరంగా ఉన్నారు.తన సినిమా షూటింగులతో బిజీ అయిపోయి అసలు తనకు రాజకీయాలకు ఏవిధమైన సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఆఖరికి తన సొంత తమ్ముళ్లు రాజకీయాల్లోకి వచ్చినా కనీసం వారి తరపున చిరు ప్రచారానికి కూడా రాలేదు.
ఇక ప్రస్తుతం బీజేపీ విషయానికి వస్తే టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని బీజేపీ తన వ్యూహాలు అమలుచేస్తోంది.
ఇక ఓడిపోయిన ఎమ్మెల్యేలలో చాలా మంది ఇప్పటికే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.చిరు కనుక తమ పార్టీలో చేరితే పార్టీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పగించడమే కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చిరు బీజేపీ ఆఫర్ ను ఎంతవరకు ఒప్పుకుంటాడు అనేది తేలాల్సి ఉంది.అయితే బీజేపీలోని కీలక నాయకులు కొంతమంది చిరు సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు.
ఈ చర్చల్లో ఏదైనా క్లారిటీ వస్తే చిరు పొలిటికల్ రీ ఎంట్రీకి సంబంధించి ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.