కాంగ్రెస్ లో మంత్రి పదవి అనుభవించి ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్న మెగా స్టార్ చిరంజీవి ప్రస్తావన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కి అత్యవసరం అయ్యింది.ఒక పక్క చిరు తమ్ముడు పవన్ జనసేన పార్టీ పేరుతో రాజకీయ వేగం పెంచడంతో ప్రత్యామ్న్యాయంగా చిరంజీవిని రంగంలోకి దింపి పవన్ హవాకు కొంచెం అడ్డుకట్ట వెయ్యాలని కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచన.
కానీ చిరు క్రియాశీల రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు.ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా అని ప్రశ్నిస్తే, ఆ పార్టీ వర్గాల నుంచే సరైన సమాధానం రాదు.
అయితే, ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో గతంలో పార్టీకి సేవలందించి, తటస్థంగా ఉన్నవారిని వెనక్కి రప్పించే పనిలో ఉంది.
అందుకే చిరు కోసం కాంగ్రస్ పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
చిరు కాంగ్రెస్ లో మళ్ళీ యాక్టివ్ అయ్యినా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారా అనేది అనుమానంగానే ఉంది.ఈ విషయం గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ తో చిరు మాట్లాడారని, ఎన్నికలకు కొన్ని నెలల ముందు వచ్చి ప్రచారం చేసేందుకు చిరు ఒకే చెప్పినట్టు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు.చెప్పుకుంటున్నారు.
ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘవీరా కూడా ఇదే విషయం గురించి చెప్తున్నాడు.చిరు ఈ విషయం తనకు ముందే చెప్పారని ఆయన తప్పకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
కానీ ఎందుకో చిరు ఎన్నికల ప్రచారానికి వస్తారంటే అందరిలోనూ అనుమానమే ఉంది.ఎందుకంటే, ఓ పక్క మెగాస్టార్ అభిమానులు జనసేనలోకి ఈ మధ్యనే పెద్ద ఎత్తున చేరారు.చిరంజీవి ఫ్యాన్స్ రాజకీయంగా పవన్ కల్యాణ్ కి మద్దతుగా ఉంటారనే సంకేతాలు ఇచ్చారు.పైగా, పవన్ కల్యాణ్ కూడా కాంగ్రెస్ పై ఏమంత సున్నితంగా వ్యవహరించడం లేదు.
ఇతర పార్టీల మాదిరిగానే కాంగ్రెస్ పై కూడా తీవ్రస్థాయి విమర్శలే చేస్తున్నారు.పరిస్థితి ఇలా ఉన్నప్పుడు.
ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చి, కాంగ్రెస్ తరఫున చిరు ఏ విధంగా ప్రచారం చేసే అవకాశం ఉందో కాంగ్రెస్ నాయకులకే తెలియాలి.