మెగాస్టార్ చిరంజీవి వరుస అవకాశాలతో తెలుగులో నంబర్ వన్ స్టార్ హీరోగా ఉన్న సమయంలో రాజకీయాలపై ఉన్న ఆసక్తితో సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే ముఖ్యమంత్రి కావడంతో చిరంజీవి సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారని అందరూ భావించారు.
అయితే ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో కేవలం 18 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించింది.ఎన్నికల్లో పరాజయం అనంతరం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవి తర్వాత కాలంలో రాజకీయాలకు దూరమయ్యారు.
అయితే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో ఉన్నారు.చిరంజీవి మాత్రం తమ్ముడి పార్టీ కార్యక్రమాల విషయంలో ఏ మాత్రం జోక్యం చేసుకోవడం లేదు.
అయితే మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని భావిస్తున్నారు.
అయితే చిరంజీవి సమంత హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ షోకు హాజరై రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఖైదీ నంబర్ 150 సినిమాతో రీఎంట్రీ తరువాత వరుస విజయాలు సాధిస్తూ అవకాశాలతో బిజీగా ఉన్న చిరంజీవి సినిమాలకు దూరమైన పది సంవత్సరాలలో రాజకీయాలు తనకు అస్సలు సూట్ కావనే విషయం అర్థమైందని తెలిపారు.ఆ పది సంవత్సరాల సమయంలో తాను చాలా విషయాలను తెలుసుకున్నానని అన్నారు.
మళ్లీ జన్మంటూ ఉంటే మాత్రం తాను నటుడిగానే ఉండాలని కోరుకుంటానని చిరంజీవి తెలిపారు.రాజకీయాలపై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని తేల్చి చెప్పారు.గత కొంతకాలం నుంచి ఒక జాతీయ పార్టీ నుంచి చిరంజీవికి ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిరంజీవి ఒక్కమాటతో పొలిటికల్ ఎంట్రీ గురించి తేల్చి చెప్పేశారు.చిరంజీవి స్పష్టత ఇవ్వడంతో మెగాస్టార్ రీఎంట్రీ గురించి ఇకపై పుకార్లు ఆగుతాయేమో చూడాల్సి ఉంది.