చాలా గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సరికొత్త విజయాన్ని అందుకున్నారు.ఎంత గ్యాప్ వచ్చినా తన పర్ఫామెన్స్ ఏమాత్రం తగ్గ లేదనే విషయాన్ని చిరు ఈ సినిమాతో నిరూపించుకున్నాడు.
తాజాగా వైసిపి అధినేత జగన్ తో భేటీ అయ్యేందుకు కొద్దిరోజులుగా చిరు ప్రయత్నిస్తూ ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాడు.
అయితే వీరిద్దరి కలయిక మధ్య ఏదైనా పొలిటికల్ ప్రాధాన్యాలు ఉన్నాయా ? అసలు వీరిద్దరి భేటీ వెనక కారణాలు ఏంటి ? అనేది ఇంకా స్పష్టంగా తేలలేదు.ప్రస్తుతం చిరంజీవి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేనట్టుగానే చిరు వ్యవహరిస్తున్నారు.
ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాను అని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం చిరు రాజకీయాల వైపు చూసే అవకాశమే లేదు.జగన్ తో చిరంజీవి మీటింగ్ రాజకీయాలకు అతీతంగానే ఉండబోతున్నట్టు కనిపిస్తోంది.కేవలం సైరా సినిమాను చూడాల్సిందిగా జగన్ ను కోరేందుకు చిరు అక్కడికి వెళుతున్నాడు.
ఈ మధ్యనే తెలంగాణ గవర్నర్ తమిళ సై ని కలిసి ఈ సినిమా చూడాల్సిందిగా చిరు కోరాడు.కానీ ప్రస్తుతం జగన్ తో భేటీ అవ్వడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇబ్బందిగా మారే పరిస్థితి కనిపిస్తోంది.
జగన్ పై పవన్ ప్రస్తుతం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడు.వంద రోజుల పాలన పై బుక్ లెట్ కూడా రిలీజ్ చేసి సంచలనం సృష్టించాడు.ప్రస్తుతం తన అన్న తన రాజకీయ శత్రువు తో భేటీ కావడం పవన్ పై తీవ్రస్థాయిలోనే ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది.
మెగా అభిమానుల్లో ఇప్పటికే ఈ విషయంపై చీలిక మొదలైంది.చిరు ఫ్యాన్స్ చాలామంది జగన్ కు అనుకూలంగా మారే అవకాశం కూడా ఏర్పడేందుకు అవకాశం కనిపిస్తోంది.అలాగే జనసేనకు వెన్నుదన్నుగా ఉన్న కాపులలో చీలిక మొదలయ్యి జగన్ కు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంటుంది.
ఈ లెక్కన చూస్తే జనసేన ఓటు బ్యాంకుకు చిల్లులు పడే అవకాశం కనిపిస్తోంది.చిరంజీవి కూడా తన దారి వేరు పవన్ దారి వేరు అని ఈ భేటీ ద్వారా ప్రజల్లోకి సంకేతాలు పంపించే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం వీరి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.