బంధాలు, బంధుత్వాలు ఇంటి వరకే పరిమితమని, రాజకీయాల్లోకి వచ్చాక ఎవరి దారి వారిదే అని నిరూపిస్తున్నారు మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు.జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ దూకుడుగా ముందుకు వెళుతూ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ విమర్శలు చేస్తున్నారు.
గతంలో ప్రజారాజ్యం స్థాపించిన చిరంజీవి రాజకీయపరంగా విమర్శలు చేసినా ఎప్పుడు వ్యక్తిగత విషయాల జోలికి పోలేదు.కేవలం విధానపరంగా విమర్శలు చేస్తూ తాను శాంత స్వభావం కలిగిన వాడిని అని చిరంజీవి నిరూపించుకున్నారు.
కానీ ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ దూకుడుగా వెళ్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు.దీంతో వీరు భిన్న ధ్రువాలు అనే అభిప్రాయం అందరిలోనూ కలిగింది.
పవన్ కళ్యాణ్ ఎదుగుదలకు చిరంజీవి ఎంతో మద్దతు పలికారు.పవన్ సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా మెగా అభిమానుల మద్దతు పవన్ కు ఉంటూ వచ్చేది.
చిరంజీవి సినిమాల్లో నటించడం తగ్గించాక చిరు ఫ్యాన్స్ కూడా పవన్ ను ఆరాధిస్తూ వస్తున్నారు.ముందు నుంచి పవన్ స్వభావం తెలిసిన చిరంజీవి ఆయన్ని దగ్గరకు తీసుకున్నా రాజకీయ పరంగా దూరం పెడుతూనే వచ్చారు.
ప్రజారాజ్యం స్థాపించిన సమయంలో యువరాజ్యం అధినేత గా పవన్ కళ్యాణ్ కి బాధ్యతలు అప్పగించినా కేవలం అది ఎన్నికల ప్రచారం వరకు మాత్రమే వాడుకున్నారు తప్ప, ప్రధాన బాధ్యతలు ఏవీ పవన్ కు అప్పగించలేదు.మొత్తం అల్లు అరవింద్ కే అప్పజెప్పారు.
పవన్, నాగబాబు కూడా చిరంజీవి తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నాయకులను పంచెలు ఊడదీసి తరిమి కొడతాం అంటూ ఆవేశపూరితంగా చేసిన ప్రసంగాలు కూడా చిరంజీవి కి నచ్చేవి కాదట.పవన్ తాను చెప్పిన విధంగా నడుచుకోవడం లేదని అప్పట్లోనే చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారట.ఇక ఎన్నికల్లో ప్రజారాజ్యం పెద్దగా ప్రభావం చూపకపోవడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేరిపోతుండడంతో చిరంజీవికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.
అయితే ఈ వ్యవహారం పవన్ కు అస్సలు ఇష్టం లేదట.అందుకే ప్రజారాజ్యం పార్టీలో దెబ్బతిన్న నాయకులందరినీ ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
అయితే పార్టీ స్థాపించిన దగ్గర్నుంచి పవన్ సొంతంగా ఎదిగేలా పునాదులు వేసుకోవడం మానేసి బిజెపి, టిడిపిలకు మద్దతుగా తొలినాళ్లలోనే నిలబడడంతో జనసేన ఎదుగుదలకు స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి.
పోనీ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేశారా అంటే అది లేదు.2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులు బీఎస్పీ వంటి ఏపీలో పెద్దగా ఆదరణ , ఓటు బ్యాంకు లేని పార్టీలతో పవన్ జతకట్టారు.ఫలితంగా ఘోర పరాజయం చవిచూశారు.
ఇక అప్పటి నుంచి వైసీపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా పవన్ తనను తాను మారిపోయాడు.ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కంటే ఎక్కువగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
అయితే ఇదే సమయంలో చిరంజీవి జగన్ పరిపాలన పై, ఆయన నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు మద్దతుగా నిలబడుతుండడంతో పవన్ కు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.పవన్ రాజకీయాలు కూడా చిరుకి గందరగోళంగానే కనిపిస్తున్నాయి.
గతంలో అమరావతి ఉద్దేశించి అభివృద్ధి అంతా ఒకే చోట చేయడం ద్వారా ఒక సామాజిక వర్గానికి లబ్ధి చేకూరుతుంది అంటూ అనంతపురంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఏపీ రాజధాని అమరావతి అయి ఉండవచ్చు కానీ, తనకు మాత్రం కర్నూలు రాజధాని అంటూ పవన్ వ్యాఖ్యానించడాన్ని సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.జగన్ ఇప్పుడు మూడు చోట్ల రాజధానిని ఏర్పాటు చేయడంపై తెలుగు దేశం కంటే ఎక్కువ స్థాయిలో పవన్ బాధపడుతున్నాడు.సరిగ్గా ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అన్ని రంగాల్లో ఏపీ మీ ముందుకు వెళుతుందని, మూడు రాజధానులపై జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం అంటూ లేఖ రాయడం జనసేన కు పెద్ద ఎదురుదెబ్బ గానే భావించాలి.
పవన్ అటు చిరంజీవి ఇటు ఉండడంతో మెగా అభిమానులు ఎటువైపు ఉండాలో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఉండిపోయారు.తాము ఆరాధించే మెగా బ్రదర్స్ ఇలా అభిప్రాయ భేదాలతో ఉండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.