దేశంలో చాలామంది సినిమాల్లో నటించే హీరోలను, హీరోయిన్లను అభిమానిస్తూ ఉంటారు.అయితే ఆ అభిమానం హద్దుల్లో ఉంటే పరవాలేదు కానీ హద్దులు దాటితే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు.
మెగాస్టార్ చిరంజీవి అభిమాని ఒకరు అభిమానంతో వృథా ఖర్చులు చేసి ఇప్పుడు రోడ్డున పడ్డారు.ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో చిరంజీవిని కలిసి తన కష్టాలు చెప్పుకొని సహాయం చేయమని కోరాలని అనుకున్నా కలిసే అవకాశం కుదరకపోవడంతో మీడియా ద్వారా ఆయన అవేదనను తెలుపుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ లోని భవానీనగర్ కు చెందిన బాలాజీకి చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే వీరాభిమానం.చిరంజీవి కొత్త సినిమా విడుదలైతే టికెట్ రేటు ఎంత ఉన్నా సినిమా చూసేవారు.
చిరంజీవి సినిమాలు విడుదలైతే సొంత ఖర్చుతో కటౌట్లు పెట్టడం, పాలాభిషేకం చెయ్యడం, 50 రోజుల, 100 రోజుల ఫంక్షన్లు నిర్వహించి అన్నదానాలు చేయడంలాంటివి చేసేవారు.చిరంజీవి సినిమా స్టేట్ రౌడీ విడుదలైన సమయంలో టికెట్ల కోసం జరిగిన గొడవలో ప్రమాదవశాత్తు బాలాజీ ఎడమ కన్ను పోయింది.
కంటి చికిత్స కోసం బాలాజీ డబ్బులు ఖర్చు చేశారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించిన సమయంలో బాలాజీ వందల సంఖ్యలో చిరంజీవి అభిమానులను హైదరాబాద్ కు సొంత ఖర్చులతో తరలించి బ్లడ్ డొనేషన్ చేయించారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సొంత ఖర్చులతో ప్రచార కార్యక్రమాలు చేశారు.ఆ సమయంలో పొలాలు, ఆస్తులను కూడా అమ్మేశాడు.
ఆస్తులు మొత్తం పోవడంతో బాలాజీ భార్యతో పాటు పిల్లలు సైతం సరైన తిండి లేక ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు.చిరంజీవిని కలిసే అవకాశం దొరక్కపోవడంతో బాలాజీ రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు.
అయితే బాలాజీ నిజంగానే ఆస్తులు పోగొట్టుకున్నాడా.? అనే విషయం తెలియాల్సి ఉంది.అభిమాని కష్టాలు మీడియా ద్వారా చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.