మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రీకరణలో పాల్గొంటున్నాడు.త్వరలోనే పూర్తి కాబోతున్న ఈ చిత్రంను అక్టోబర్ 2న విడుదల చేయాలని నిర్ణయించారు.
అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.ఇక సంవత్సర కాలంగా చిరంజీవి 152వ చిత్రంకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి.
చిరు 152వ చిత్రానికి కొరటాల దర్శకత్వం వహించబోతుండగా రామ్ చరణ్ నిర్మించనున్న విషయం తెల్సిందే.ఈ చిత్రం గత ఏడాదిలోనే ప్రారంభం అవుతుందని అంతా భావించారు.
కాని సైరా చిత్రంతో బిజీగా ఉన్న చిరంజీవి మరో సినిమా షూటింగ్లో పాల్గొనలేడని వాయిదా వేస్తూ వచ్చారు.
సైరా చిత్రం షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది.ఈ సమయంలోనే కొరటాల తన మూవీని ప్రారంభిస్తాడని అంతా భావించారు.కాని ఇంకా కొంత కాలం ఈ సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ తాను తయారు చేసుకున్న కథకు చిరంజీవి బరువు తగ్గాలని సూచించాడట.దాంతో సైరా పూర్తి అయిన వెంటనే మూడు నాలుగు నెలల పాటు కష్టపడి చిరంజీవి బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు.
చిరంజీవి బరువు తగ్గిన తర్వాత సినిమాను పట్టాలెక్కించే అవకాశం కనిపిస్తుంది.గత ఏడాది ఆరంభంలో భరత్ అనే నేను చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన కొరటాల శివ సంవత్సరంనర కావస్తున్నా ఇంకా తన తదుపరి చిత్రంను ప్రారంభించక పోవడం విడ్డూరంగా ఉంది.ఒక బ్లాక్ బస్టర్ తర్వాత మరీ ఇంత గ్యాప్ను ఏ దర్శకుడు కూడా కోరుకోడు.కాని కొరటాల మాత్రం చిరంజీవితో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆగాల్సి వచ్చింది.
భరత్ అనే నేను చిత్రానికి కొరటాల తదుపరి చిత్రానికి రెండేళ్ల గ్యాప్ ఉండే అవకాశం కనిపిస్తుంది.ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఇలా రెండేళ్లకు ఒకటి సినిమా చేస్తే ఎలా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.