ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ నాయకుల్లో వివాస్పద వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే తడుముకోకుండా సూచించే వ్యక్తి దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్.ఆయన ఎప్పుడూ… ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు.
తన నియోజకవర్గానికి తానే రాజు తానే మంత్రి అని ఆయన భావిస్తూ ఉంటారు.అందుకే ఎప్పుడూ ఎవరిని లెక్కచేయనట్టుగా ఉంటారు.
అంతెందుకు సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్ర బాబు ను సైతం లెక్కచేయనట్టుగా ఆయన ప్రవర్తిస్తుంటారు.తాజాగా ఆయన ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు.
తన నోటి దురుసు చూపించి అభాసుపాలయ్యారు.పెరిగిన పెన్షన్ ఇస్తారని వెళ్లిన వృద్దుడిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన ప్రతాపం చూపారు.
పశ్చిమ గోదావరి జిల్లా, పెదవేగి మండలం విజయరాయిలో, ప్రభుత్వ అధీనంలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చింతమనేని హాజరయ్యారు.ముందుగా మహిళలను పిలిచి చెక్కులు అందిచారు, తరువాత వృద్దులకు పెన్షన్ అందిస్తున్న సమయంలో, లేగల సుబ్బారావు అనే వృద్దుడు పై చింతమనేని నోటికొచ్చినట్లు తిట్టారు.నీ కొడుకులు వైసీపీలో తిరుగుతుంటే నీకు టీడీపీ వాళ్ళు ఇచ్చే పెన్షన్ ఎందుకంటూ, ఇష్టమొచ్చినట్లు తిట్ల పురాణం అందుకున్నారు.అక్కడితో ఆగలేదు.వైసీపీలో ఉండి పెన్షన్ తీసుకోవడానికి సిగ్గులేదా అంటూ అందరి ముందు అవమానించారు.
సభ వేదికపైన వేల మంది చూస్తున్న సమయంలో, చింతమనేని బూతులు తిట్టడంతో సుబ్బారావు తీవ్ర మనస్తాపం చెందారు.సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లి తండ్రిని ఇంటికి తీసుకెళ్తున్న కుమారుడు రాధాకృష్ణపైనా, చింతమనేని దురుసుగా ప్రవర్తించారు.దీంతో చిన్న తోపులాట చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే తీరుపై రాధాకృష్ణ ప్రశ్నించడంతో, ఆగ్రహనికి గురైన చింతమనేని, మైక్ విసిరేసి సమావేశం మధ్యలోంచి వెళ్లిపోయి, తనకు ఎదురు తిరిగిన రాధాకృష్ణను అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించారు.అయితే ఈ విషయం తెలుసుకున్న దెందులూరు వైసీపీ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి, సీనియర్ నేత కొఠారు రామచంద్రరావు ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు , గ్రామస్తులు చింతమనేని తీరుకు నిరసన తెలిపారు.
వృద్దుడిపై దౌర్జన్యం చేయడంతో పాటు బూతులు తిట్టిన ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ ఆందోళన చేశారు.