గాల్వాన్ లోయలో భారత్, చైనా ఆర్మీ మధ్య జరిగిన గొడవలలో భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగింది.20 మంది భారతీయులు చనిపోగా, చైనాకి చెందిన వారు కూడా ఎక్కువ సంఖ్యలో చనిపోయారని తెలుస్తుంది.ఈ ఘర్షణల తర్వాత ఇండియాలో దేశీయంగా చైనా ఉత్పత్తులు, యాప్స్ పై నిషేధం విధించాలని డిమాండ్ రావడం, ఆ దిశగా ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది.ఇండియా మార్కెట్ లో చైనా వస్తువులు, యాప్స్ బ్యాన్ చేయడం వలన ఆ దేశంలో వ్యాపార సంస్థలు, ప్రభుత్వం వేల కోట్ల రూపాయిలు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.
దీనిని జీర్ణించుకోలేకపోతున్న చైనా ప్రభుత్వం ఆ దేశ హ్యాకర్లుని ప్రోత్సహిస్తూ భారత్ పై సైబర్ దాడులకి తెగబడుతుంది.గత రెండు వారాల వ్యవధిలో భారత వెబ్ సైట్లపై జరుగుతున్న దాడులు 300 శాతం వరకూ పెరిగాయని సింగపూర్ కు చెందిన సైబర్ రీసెర్చ్ పేర్కొంది.
చైనా హ్యాకర్ల దాడులు భారీ స్థాయిలో పెరిగాయని సంస్థ సీఎండీ రితేశ్ కుమార్ తెలిపారు.ఈ సమాచారాన్ని తాము భారత ప్రభుత్వ సీఈఆర్టీతో పంచుకున్నామని అన్నారు.
చైనా హ్యాకర్లంతా తొలుత వెబ్ సైట్లపై దృష్టిని పెడుతున్నారని, ఆపై కీలక సమాచారం సేకరించి, టార్గెట్ ను ఎంచుకుంటున్నారని, దాని తరువాత దాడులకు దిగుతున్నారని ఆయన అన్నారు.గత నెల 18వ తేదీకి ముందు రియల్ ఎస్టేట్, మీడియా, ప్రభుత్వ రంగ ఏజన్సీలు, స్మార్ట్ ఫోన్లు తదితర వెబ్ సైట్లను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు, ఆ తరువాత మరింతగా దిగజారిపోయి సంస్థల పరువు తీయడం, మేధో హక్కులను దొంగిలించడం, ముఖ్యమైన సమాచారాన్ని తస్కరించడం, వినియోగదారుల వివరాలు సేకరించడం వంటి పనులు చేస్తున్నారని ఆయన అన్నారు.
చైనా రాజధాని బీజింగ్ తో పాటు గ్వాంగ్ ఝో, షెన్ జన్, చెంగ్డూ తదితర నగరాల నుంచి ఈ దాడులు జరుగుతున్నట్టు తమ రీసెర్చ్ లో తేలిందని, దీనికి చైనా ప్రభుత్వం కూడా అండగా నిలుస్తోందని అన్నారు.చైనా ఆర్మీకి చెందిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇండియా మీద ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తుందని తెలిపారు.