ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి చెప్పగానే ప్రతి ఒక్కరూ ఉలిక్కి పడుతున్నారు.మామూలు దగ్గు,జలుబు ఉన్నా కూడా జనాలు భయపడే రోజులు వచ్చేశాయి.
ఎక్కడో చైనా లో మొదలైన ఈ కరోనా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతుంది.ఈ కరోనా భారత్ లోనూ కలకలం సృష్టిస్తుంది.
ఇప్పటికే మొత్తం 30 మందికి కరోనా పాజిటివ్ తేలగా,వందల మంది అనుమానితులు గా ఉన్నారు.తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కరోనా భయం పట్టుకుంది.
తెలంగాణా లో ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా,ఏపీ లో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ధారిత కేసులు నమోదు కాలేదు.అయితే ఇప్పుడు విశాఖ వాసులకు మరో భయం వచ్చి చేరింది.
చైనా నుంచి వచ్చిన షిప్ విశాఖ తీరానికి చేరుకోవడం తో విశాఖ వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.ఆ షిప్ లో మొత్తం 22 మంది సిబ్బంది ఉండగా,వారిలో 17 మంది చైనీయులు,ఐదుగురు మయన్మార్ వాసులు ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం తో అధికారులు ఆ షిప్ ను పోర్టు కు దూరంగా నిలిపివేసినట్లు తెలుస్తుంది.అక్కడే షిప్ సిబ్బందికి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం.చైనా లో మొదలైన ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాప్తి చెందింది.ఇప్పటికే ఈ కరోనా మృతుల సంఖ్య 3,383 కి చేరుకోగా వేల సంఖ్యలో అనుమానితులు ఆసుపత్రిలో వైద్య చికిత్స చేయించుకుంటున్నారు.
చైనా తరువాత ఇరాన్ లో ఈ కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా నమోదు కాగా,అగ్రరాజ్యం అమెరికా లో కూడా ఈ వైరస్ ప్రబలుతున్నట్లు తెలుస్తుంది.