అగ్రరాజ్యం అమెరికా, చైనా లు ఢీ అంటే ఢీ అనుకుంటున్నాయి.అమెరికా ఏదైనా చైనా కు నష్టం కలిగించే విధంగా నిర్ణయం తీసుకోగానే చైనా కూడా అదే రియాక్షన్ చూపిస్తుంది.
అయితే ఇటీవల చైనా టెక్నాలజీ దిగ్గజం హువావేను ఎలాగైనా దారికి తెచ్చుకొనేందుకు అమెరికా కొన్ని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.అయితే దానికి హువావే ఏమాత్రం బెదరకుండా ఘాటుగానే స్పందించింది.
అయితే ఇప్పుడు అమెరికా కు చైనా యువత భారీ షాకిచ్చినట్లు తెలుస్తుంది.తమ దేశ టెక్ దిగ్గజం హువావేకు అక్కడి యూజర్లు మద్దతుగా నిలుస్తూ దేశవ్యాప్తంగా ఆపిల్ ఉత్పత్తులను నిషేధించాలంటూ పిలుపు నివ్వడం విశేషం.
ప్రంపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన హువావే ఉత్పత్తులు, టెక్నాలజీపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు విధించడం తో చైనా లోని యువత యాంటీ ఆపిల్ ఉద్యమానికి పిలుపునిచ్చింది.
ఈ క్రమంలో ట్విటర్, వైబోలాంటి సోషల్ మీడియా వేదికల్లో ఆపిల్ ఉత్పత్తులను బ్యాన్ చేయాలంటూ వారు ఉద్యమాన్ని లేవనెత్తడం తో ఈ పోస్టులకు మిలియన్ల కొద్దీ లైకులు, షేర్లు లభిస్తున్నాయి.
దీంతో చైనా అంతటా ఈ యాంటీ ఆపిల్ ఉద్యమం ఊపందుకుంది.మరోవైపు ఈ నిర్ణయం స్వల్పకాలంలో చైనాలో ఆపిల్ అమ్మకాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే దీనిపై ఇంకా ఆపిల్ సంస్థ స్పందించలేదు.తొలుత హువావే పై ఆంక్షలు విధించిన ట్రంప్ సర్కార్ ఆ తరువాత ఆ సంస్థకు 90 రోజుల గడువు ఇస్తూ ఆంక్షలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.