ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్ లు, ఫోన్ లో ఇంటర్ నెట్ ఉపయోగించేవారు సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది.మొబైల్ ఫోన్, ఇంటర్ నెట్ వాడకం వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే స్థాయిలో అనర్ధాలు కూడా చోటు చేసుకుంటున్నాయి అనేది ముమ్మాటికీ నిజం.
ఈ నేపథ్యంలో వీటి వాడకంపై కొన్ని దేశాలు కఠిన నియమ, నిబంధలను రూపొందిస్తున్నాయి.తాజాగా చైనాలో ఇక నుంచి కొత్త మొబైల్ ఫోన్ సర్వీస్ కావాలనుకునే వారు తమ ఫేస్ ను స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సింది ఉంటుంది.
దీనికి సంబంధించి ఇప్పటికే చైనా ప్రభుత్వం సెప్టెంబర్లోనే నిబంధనలను ప్రకటించింది.
తాజాగా ఆదివారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి తీసుకొస్తోంది.
ఇంతకు ముందు కొత్తగా ఫోన్ కానీ, మొబైల్ డేటా కాంట్రాక్టులను తీసుకున్నప్పుడు జాతీయంగా ఉన్న గుర్తింపు కార్డులను తీసుకుంటే సరిపోయేది.కానీ ఇక నుంచి ఆ గుర్తింపు కార్డులతో పాటు ముఖాన్ని కూడా స్కాన్ చేయాల్సిందేనని చైనా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది.
చైనా ప్రభుత్వం ఇటువంటి నిబంధనలు రూపొందించడం ఇప్పుడు కొత్తేమి కాదు.గతంలోనే చైనా ప్రజలు ఇంటర్నెట్ వాడాలంటే వారి అసలు పేరుతోనే లాగిన్ అయ్యేలా నిబంధనలు పెట్టింది.
అలాగే 2017 నుంచి ఎవరైనా ఆన్లైన్లో కొత్త విషయాన్ని పోస్టు చేయాలంటే అసలు ఐడీని ఎంటర్ చేయాలనే నిబంధనను తీసుకొచ్చింది.