ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా బంధ హస్తాల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది.ఈ మహమ్మారికి పుట్టిల్లు చైనానే అని ప్రపంచ దేశాలు దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఇప్పుడు మళ్లీ అదే దేశంలో ఒమిక్రాన్తో పాటు కరోనా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి.అయితే, త్వరలో చైనా రాజధాని బీజింగ్ లో వింటర్ ఒలంపిక్స్ ప్రారంభం కానున్నాయి.
దీన్ని దృష్టిలో పెట్టుకుని క్రీడలకు ఎటువంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు చైనా ప్రభుత్వం ‘జీరో కొవిడ్’ పాలసీని అమలుచేస్తోంది.
కాగా, చైనా కోవిడ్ రూల్స్ ని ఎంత కఠినంగా అమలు చేస్తుందో తాజాగా ఓ వీడియో ద్వారా బయటపడింది.
బయటపడిన వీడియో ప్రకారం.చాలా ప్రాంతాల్లో క్వారంటైన్ క్యాంపులను తాత్కాలికంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా మిలియన్ల మంది ప్రజలను కిక్కిరిసిన మెటల్ బాక్స్లలో నిర్భంధిస్తోంది.రైలు పెట్టెల మాదిరిగా ఇనుప బాక్సులతో చిన్నపాటి గదులను నిర్మించారు.
గ్రామంలో ఒక్క పాజిటివ్ కేసు వచ్చినా.గ్రామం మొత్తం ఇనుపు బాక్సుల్లో రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిందే.
చిన్న, పెద్ద, గర్భిణులు, వృద్ధులు అనే తేడా లేదు.అందరినీ క్వారంటైన్ బాక్సుల్లోకి నెట్టేస్తున్నారు.
కొన్ని గ్రామాల్లో అయితే అర్ధరాత్రి వచ్చి నిద్రలేపి నిమిషాల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలి రావాలని హుకుం జారీ చేస్తున్నారు.బస్సుల్లో వారిని తరలిస్తున్నారు.ఈ కఠిన ఆంక్షల కారణంగా చైనాలో ఇప్పుడు దాదాపు 20 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు.ఆఖరికి ఆహారం, తదితర నిత్యావసరాలు కూడా కొనడానికి కూడా తమ ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు.
కాగా ఈ కఠిన చర్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.చైనా వైరస్ అనే అపకీర్తి మూటగట్టుకున్న చైనా ఇప్పుడు కరోనా కట్టడి కోసం కఠిన ఆంక్షలు చేస్తోందని కొందరు మండిపడుతున్నారు.