గత ఏడాది జూన్ 15వ తేదీన తూర్పు లడఖ్ లోని గాల్వన్ లోయలో భారత సైనికులతో జరిగిన సరిహద్దు ఘర్షణలో తమ దేశ సైనికులు కూడా మరణించారని చైనా ప్రభుత్వం తొలిసారిగా ఒప్పుకుంది.ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించారని అప్పట్లో ఇండియన్ మిలటరీ అధికారులు వెల్లడించారు.
చైనా వైపు కనీసం 30 మంది సైనికులు చనిపోయి ఉండొచ్చని భారత ఆర్మీ అధికారులు చెప్పుకొచ్చారు.ఈ ఘర్షణ అనంతరం చాలా మంది చైనా సైనికులను స్ట్రెచెర్ పై తీసుకెళ్లారని.
వారే కనీసం 60 మంది దాకా ఉంటారని మన భారతీయ ఆర్మీ అధికారులు చెప్పారు.
మరోవైపు ఈ ఘర్షణలో చైనా సైనికులు 45 మంది వరకు చనిపోయి ఉండొచ్చని అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయి.
కానీ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ఈ ఘర్షణలో తమ వైపు చనిపోయిన సైనికుల సంఖ్య గురించి పెదవి విప్పలేదు.పైగా ఈ ఘర్షణలో సైనికులు చనిపోయినట్టు వస్తున్న వార్తలను చైనా ఆర్మీ ఖండించింది.
కానీ తాజాగా చైనా ప్రభుత్వం గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో తమవైపు కూడా నలుగురు జవాన్లు చనిపోయారు అని ప్రకటించింది.మరణించిన వారి పేర్లు చెన్ హాంగ్జున్, చెన్ జియాన్గ్రాంగ్, గ్జియో సియువాన్, వాంగ్ జోరాన్ అని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ శాఖ వివరాలను పేర్కొంది.
అలాగే మృతులను హానరరీ టైటిల్ తో సెంట్రల్ మిలటరీ కమిషన్ గౌరవించింది.ఘర్షణ జరిగిన రోజు చైనా జవాన్లకు నాయకత్వం వహించిన కల్నల్ ‘కీ ఫాభో’ కి కూడా అవార్డు ప్రకటించింది.అయితే కల్నల్ ఈ ఘర్షణలో బాగా గాయపడ్డారని తెలుస్తోంది. గ్లోబల్ టైమ్స్ ఈమేరకు చైనా సైనికుల వివరాలను ప్రచురించింది.గాల్వన్ లోయలో గత ఏడాది జరిగినటువంటి అతిపెద్ద ఘర్షణ గత 45 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదు.ఇప్పటికీ చైనా సైనికులు సరిహద్దు ప్రాంతాల్లో కయ్యానికి కాలుదువ్వే ప్రయత్నం చేస్తున్నారు.