జీ తెలుగు ఛానల్ లో డ్రామా జూనియర్స్ షో ఎంతగా ఫెమస్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఆ షో ని రిగ్యులర్ గా ఫాలో అయ్యేవారు ఖచ్చితంగా జూనియర్ బాలకృష్ణ గా గుర్తింపు పొందిన గోకుల్ సాయి కృష్ణ గుర్తు ఉండే ఉంటాడు.
గుక్క తిప్పుకోకుండా బాలయ్య బాబు డైలాగులతో ప్రేక్షకుల చేత జూనియర్ బాలకృష్ణ గా పిలిపించుకున్న గోకుల్ ఇక లేడు అన్న వార్త దిగ్బ్రాంతి ని కలిగిస్తుంది.డెంగ్యూ జ్వరం తో బాధపడుతున్న గోకుల్ బెంగుళూరు లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
చిత్తూరు జిల్లా మదనపల్లె కు చెందిన గోకుల్ డ్రామా జూనియర్ షో తో ప్రేక్షకుల లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.అతడి డైలాగ్ డెలివరీ చూసిన ప్రతి ఒక్కరూ కూడా అతడికి మంచి భవిష్యత్తు ఉంటుంది అని భావించారు.
అయితే ఇలా డెంగ్యూ జ్వరం తో గోకుల్ మృతి చెందడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.గోకుల్ మృతి పై స్వయంగా బాలయ్య బాబు కూడా స్పందించారు.
‘నేనంటే ప్రాణం ఇచ్చే చిన్నారి అభిమాని గోకుల్ ఈరోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది.అతడు డైలాగులు చెప్పిన విధానం.
హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటగా అనిపించేది.ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ జ్వరంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం నాకు బాధ కలిగించింది.
ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.’ అని బాలకృష్ణ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.మరోపక్క గోకుల్ మృతి ని అతడి కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.ఎంతో భవిష్యత్తు ఉంటుంది అని అనుకున్న కుమారుడు ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం తో వారు కన్నీరు మున్నీరు గా వారు రోదిస్తున్నారు.