అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది.అది కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత వుండే అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో ఈ ఘటన జరగడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.
ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు.వివరాల్లోకి వెళితే.
అమెరికా కాలమానం ప్రకారం.శనివారం సాయంత్రం టైమ్స్ స్క్వేర్లోని 7వ అవెన్యూ, 44 స్ట్రీట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
బ్రూక్లిన్లో నివసించే ఓ కుటుంబం టైమ్స్ స్క్వేర్ను తిలకించడానికి వచ్చింది.అదే సమయంలో తమ కుమార్తెకు బొమ్మలను కొంటుండగా.
గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా కాల్పులకు దిగాడు.ఈ ఘటనలో ఆ బాలిక (4)కు బులెట్ గాయాలయ్యాయి.
ఆ కుటుంబంతో సంబంధం లేని మరో ఇద్దరు మహిళలు సైతం గాయపడ్డారు.వారిలో ఒకరు రోడ్ ఐలండ్స్కు చెందిన యువతి (23) కాగా, మరొకరు న్యూజెర్సీకి చెందిన మహిళ (43)గా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.కాల్పులు జరిపిన వ్యక్తిని నల్లజాతీయుడిగా గుర్తించినట్లు న్యూయార్క్ పోలీస్ కమిషనర్ డెర్మాట్ షియా తెలిపారు.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఫోటోలను విడుదల చేసిన పోలీసులు అతడిని మోస్ట్ వాంటెడ్గా ప్రకటించారు.ఈ ఘటన వెనుక కారణాలు తెలియాల్సి వుంది.
ఈ కాల్పుల ఘటనపై న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, గాయపడ్డ బాధితులు కోలుకుంటున్నారని తెలిపారు.
నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
కాగా, అమెరికాలో తరచూ చోటు చేసుకుంటున్న కాల్పుల ఘటనలను అధ్యక్షుడు బైడెన్ సీరియస్గా తీసుకున్నారు.దేశంలో తుపాకీ హింసను అరికట్టేందుకు ఆయన గత నెలలో కఠిన చర్యలను ప్రకటించారు.దీనిలో భాగంగా దేశీయంగా తయారయ్యే కొన్ని రకాల తుపాకులపై ఆంక్షలు విధించడంతో పాటు అసాల్ట్ రైఫిళ్లపై గతంలో అమలైన నిషేధాన్ని తిరిగి కొనసాగించాలని ఆయన కాంగ్రెస్కు విజ్ఞప్తి చేశారు.