ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు అతి తక్కువ సమయంలోనే టికెట్ తెచ్చుకుని సంచలనం సృష్టించారు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని కుమారి.దీంతో ఆమె పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోయింది.
కానీ ఇప్పుడు మాత్రం కొంతమంది పార్టీ నేతల తీరుపై ఆమె గుర్రుగా ఉన్నారు.ఎన్నికల ముందు వైసీపీ తరుపున టికెట్ దక్కించుకునేందుకు ఆమె ఎన్నో బందులు ఎదుర్కొన్నా చివరకు అందరిని ఒప్పించి టిక్కెట్ సాధించడంతోపాటు సీనియర్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఓడించి రజిని విజయకేతనం ఎగురవేశారు.
చిలకలూరిపేటలో ప్రప్రధమ బీసీ ఎమ్మెల్యేగా కూడా రజిని రికార్డు సృష్టించారు.ఒక దశలో ఆమెకు రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గా కూడా అవకాశం దక్కుతుందని అంతా భావించారు.
కానీ ఆమె ఎమ్మెల్యే తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అయితే ప్రస్తుతం చిలకలూరిపేటలో తమ సొంత పార్టీలో నెలకొన్న గ్రూప్ రాజకీయాలతో బాగా విసిగిపోయినట్టు కనిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో చిలకలూరిపేటలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో రజిని తన ఆవేదనను వెళ్లగక్కారు.చిలకలూరిపేటకు పట్టిన చీడను వదిలించాలనే ఉద్దేశంతో వైసీపీలో చేరి పోటీ చేశానని, కానీ ఆ దుష్ట శక్తులు నా కలలను చిదిమేయాలని చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.నా పోరాటానికి నిత్యం అడ్డుతగులుతూ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నిజాయితీ ఉంటే విజయం తప్పక సాధిస్తామని మొన్నటి ఎన్నికలు నిరూపించాయని రజిని అన్నారు.ఆడపిల్ల నైనా తాను నాలుగు వైపుల నుంచి శత్రువులతో నిత్యం యుద్ధం చేయాల్సి వస్తోందని, సొంత పార్టీలోనే కొంతమంది కావాలని నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, నా అనుకున్న వాళ్లు కూడా నన్ను అడ్డుకోవాలని, నియంత్రించాలని చూస్తున్నారని రజిని తన మనసులోని బాధను ఆ సమావేశంలో వెళ్లగక్కారు.
నాకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తే తాను నిస్వార్ధంగా పనిచేస్తానని ఆమె చెప్పుకొచ్చారు.కానీ కొంతమంది నా వెంటే ఉంటూ నాకే వెన్నుపోటు పొడవాలని చూస్తే వారి అంతు చూస్తానంటూ రజని హెచ్చరికలు చేశారు.అయితే చిలకలూరి పేట పరిణామాలపై అధిష్టానం కూడా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.రజనీ ఆవేదనలో నిజం ఉన్నా ఇలా బహిరంగంగా పార్టీ నాయకుల గురించి మాట్లాడితే ప్రత్యర్థి పార్టీలకు లోకువ అవుతామని, సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆమెకు సూచనలు అందినట్టు తెలుస్తోంది.
ఏదైతేనేమి ప్రస్తుతం రజనీ వ్యాఖ్యలు పార్టీలో చర్చకు తెరలేపాయి.