విలాసాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన ఓ వివాహిత కొడుకుతో కలిసి స్కెచ్ గీసింది.తానో సంపన్న కుటుంబంలో ఒక్కగానొక్క కూతురినని, తండ్రి చనిపోయాడని, తన పేరున ఉన్న ఆస్తి కోసం తల్లి వేధిస్తోందంటూ ఓ కట్టుకథ అల్లి ఓ ఎన్ఆర్ఐని బుట్టలో వేసుకుని అక్షరాల రూ.65 లక్షల రూపాయలు కొట్టేసింది.
రంగారెడ్డి జిల్లా మోకిళ ప్రాంతానికి చెందిన దేవతి శ్రీనివాస్, ఆయన భార్య మాళవిక, అలియాస్ కీర్తి మాధవనేని (44), కుమారుడు ప్రణవ్ (22), శ్రీనివాస్ తల్లి గజలక్ష్మీ విలాసాలకు అలవాటు పడి భారీగా అప్పుల పాలయ్యారు.
తేలికగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో పెళ్లి సంబంధాలు చూస్తున్న ఎన్ఆర్ఐలను ట్రాప్ చేయాలని భావించి మ్యాట్రిమోని సైట్లో ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసింది.అందులో తన పేరును కీర్తి మాధవనేనిగా పేర్కొంది.
ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వరుణ్ అనే వ్యక్తి ఆమె ట్రాప్లో పడ్డాడు.అప్పటి నుంచి అతనితో ఛాటింగ్ చేస్తూ బాగా దగ్గరైంది.
ఆ సమయంలో రిచ్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన తాను ఒక్కదాన్నే కుమార్తెనని, తన పేరిట కోట్ల రూపాయల ఆస్తులున్నాయని చెప్పింది.ఆస్తుల కోసం తల్లి వేధిస్తోందని, వాటిని నిలబెట్టుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నానని, అందుకు తనకు డబ్బు కావాలని కోరింది.ఆమె మాటలు నిజమేనని నమ్మిన వరుణ్ రూ.65 లక్షలను వివిధ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేశాడు.ఆ తర్వాత పెళ్లి గురించి ప్రశ్నించగా కీర్తిని అడిగితే దాటవేస్తూ రావడంతో పాటు ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.
దీంతో తాను మోసపోయానని గ్రహించిన వరుణ్ వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాళవిక, ఆమె కుమారుడు ప్రణవ్లను అరెస్ట్ చేశారు.మాళవిక భర్త శ్రీనివాస్, అత్త గజలక్ష్మీ పరారీలో ఉన్నారు.కాగా మాళవిక, శ్రీనివాస్లపై గతంలో నల్లకుంట, బోయిన్పల్లి, మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధుల్లో మోసాలు చేసినందుకు కేసులు నమోదైనట్లుగా తేలింది.2014లో కూడా మాళవిక, శ్రీనివాస్ దంపతులు ఓ ఎన్ఆర్ఐను మోసం చేసి పోలీసులకు దొరికిపోయారు.