ఏదో రకంగా బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు 2019 ఎన్నికలకు ముందు నుంచి ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.అయినా బీజేపీ నేతలు బాబును దూరం పెడుతూనే వచ్చారు.
టిడిపితో కలిసి ముందుకు వెళ్తే ఇక ఎప్పటికీ అధికారం దక్కించుకోలేము అని, అలాగే ఏపీలో బలోపేతం కాలేము అనే అభిప్రాయంతో బిజెపి టీడీపీని దూరం పెడుతూనే వస్తోంది.అలాగే ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు టిడిపిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూనే వస్తున్నారు.
బిజెపి ఎన్ని రకాలుగా విమర్శలు చేస్తున్నా, ఎంతగా అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తున్నా, బాబు మాత్రం బీజేపీని పల్లెత్తు మాట కూడా అనలేకపోతున్నారు.అంతే కాదు బీజేపీ తో పొత్తు కోసం ప్రయత్నిస్తునే ఉన్నారు.
బీజేపీ నేతలను విమర్శించే అంతటి సాహసం చేయలేకపోతున్నారు. బీజేపీతో పొత్తు కోసం ఈ త్యాగాలకు తాను సిద్ధం అన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు.
ప్రస్తుతం వైసిపికి ఉన్న బలం, బలగం దృష్ట్యా విడివిడిగా ఎన్నికలకు వెళితే అటు బీజేపీ, ఇటు జనసేన టిడిపి విజయం సాధించలేరు అనే విషయాన్ని బీజేపీ నేతలకు అర్థమయ్యేలా బాబు రకరకాల మార్గాల ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.రాబోయే ఎన్నికల్లో బిజెపి- జనసేన- టిడిపి ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళితే వైసీపీ ని సులభంగా ఓడించి ఆ తర్వాత మూడు పార్టీలు కలిసి ఏపీలో అధికారం పంచుకోవచ్చు అనే ఈ విషయాన్ని బాబు ఢిల్లీ బీజేపీ పెద్దలకు అర్ధం అయ్యేలా చెప్పిస్తున్నారు.
కాకపోతే 2014 ఎన్నికల్లో ఈ విధంగానే పొత్తు పెట్టుకున్నా.ఫలితాల తరువాత అధికారం దక్కించుకున్న టీడీపీ కొంత కాలనీ ఏ విధంగా వ్యవహరించింది ? ఏవిధంగా పక్కన పెట్టారు అనే విషయాన్ని బీజేపీ నేతలు ఎవరూ ఇప్పటికీ మర్చిపోలేదు.
కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇంతకు మించి మరో మార్గం లేదని అభిప్రాయాన్ని ఢిల్లీ బీజేపీ పెద్దలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.అలాగే తెలంగాణ బీజేపీ లోని కీలక నాయకులు కొందరు ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.టిడిపి మళ్ళీ బీజేపీ తో పొత్తు పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుంది అనే ఆలోచన లో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు సమాచారం.ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం కలిసి వచ్చేలా కనిపిస్తుండటం, ఢిల్లీలో రాజకీయ వాతావరణం మారుతున్న పరిస్థితుల్లో తమతో తప్పనిసరిగా పొత్తు పెట్టుకుంటారని బాబు బలంగా నమ్ముతున్నారు.
అదీ కాకుండా 2022 జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో బిజెపి జనసేన , టిడిపిలు కలిసి ఎన్నికలకు వెళ్లి అధికార పార్టీ వైసీపీ ని చిత్తుగా ఓడించాలనే లక్ష్యంతో బాబు ఉన్నారు.అయితే ఈ ప్రతిపాదనకు ఏపీ బిజెపి నేతలు అభ్యంతరం చెబుతూ వస్తున్నా, తెలంగాణ బిజెపి నేతలతో పాటు, బిజెపి అధిష్టానం పెద్దలు కొంత మంది అనుకూలంగా ఉండడంతో, త్వరలోనే ఢిల్లీకి వెళ్లి బిజెపి పెద్దలను కలిసి పొత్తుపై క్లారిటీ తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యంతో బాబు ఉన్నారట.