తెలుగుదేశం పార్టీలో ఓల్డ్ జనరేషన్ ఎక్కువయ్యింది.సీనియర్ ఎన్టీఆర్ టైంలో పార్టీలో చేరిన వారంతా నేటికీ పార్టీలో కొనసాగుతూ ఎన్నో పదవులు అనుభవించారు.
ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు.అయితే, రాబోయే రోజుల్లో వీరిని ప్రత్యక్ష రాజకీయాల్లో కాకుండా పార్టీ బలోపేతానికి వీరి సేవలను వినియోగించుకోవాలని బాబు ఆలోచిస్తున్నారట.
ఎందుకంటే కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నారు.అంతో కొంతో వీరి అనుభవం పార్టీకి పనికొస్తుందని టీడీపీ అధినేత భావిస్తున్నారని టాక్.
2024 ఎన్నికల్లో సీనియర్లను నిలబెడితే పెద్దగా ఓట్లు రాలవని ఇప్పటికే బాబు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.వీరి మాట తీరు, ప్రజలను ఆకట్టుకునే విధానంలో చురుకుదనం లేకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అందుకే వారి స్థానంలో పార్టీలో బలంగా పనిచేస్తూ ప్రజాధారణ కలిగిన యువరక్తానికి ఈసారి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట.అధికార వైసీపీని ఢీకొట్టాలంటే టీడీపీకి యువరక్తం ఇప్పుడు చాలా అవసరం.
అసెంబ్లీలో గట్టిగా మాట్లాడే వారు లేక చంద్రబాబే కొన్నిసార్లు వారితో వాగ్వాదానికి దిగుతూ అలసిపోతున్నారు.అందుకే 1983 బ్యాచ్ సీనియర్లకు ఒక గట్టి సంకేతం పంపాలని చూస్తున్నారని తెలిసింది.
సీనియర్ల అమూల్యమైన సలహాలను పార్టీ రాజకీయంగా బలపడేలా తీసుకోవాలని బాబు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం టీడీపీలో కమిడి కళా వెంకటరావు, పూసపాటి అశోక్ గజపతిరాజు, ప్రతిభా భారతి, అయ్యన్నపాత్రుడు, యనమల రామక్రిష్ణుడు, కేఈ క్రిష్ణమూర్తి, జేసీ బ్రదర్స్ వంటి సీనియర్ లీడర్లకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని చంద్రబాబు అనుకుంటున్నారట.
అయితే, వీరి స్థానంలో వారసులకు టికెట్ ఇచ్చి సీనియర్లను సంతృప్తి పరుస్తారా? అనేది వేచిచూడాలి.ఒక వేళ బాబు నిర్ణయాన్ని ఎదరించి ఈ సీనియర్లు పార్టీలు మారుతారా? లాబీయింగ్ చేస్తారా? అనేది కూడా రాబోయే రోజుల్లో చూద్దాం.