టిడిపి అధినేత చంద్రబాబు పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని బాబు ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు.
తిరుపతి ఉప ఎన్నికలలో గెలవకపోయినా వైసిపి మెజారిటీ బాగా తగ్గిస్తామని, అలాగే గతంలో టిడిపికి వచ్చిన ఓటింగ్ శాతం కంటే కాస్త ఎక్కువ సాధిస్తాము అనే ధీమా కనిపిస్తోంది.అలాగే ఈ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా టిడిపి నాయకులు అంతా తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన, సమిష్టిగా పార్టీ విజయం కోసం పనిచేసినా, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, కష్ట సమయంలో తెలుగు తమ్ముళ్లు గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ, పార్టీని మరింత దెబ్బ తీస్తున్నారని , మరి కొంతమంది నాయకులు తమ నోటి దురుసు కారణంగా అనవసరంగా జైలు పాలవుతున్నారని, ఒక వ్యూహం లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పార్టీకి చెడ్డపేరు చేయడమే కాకుండా, వ్యక్తిగతంగానూ వారు నష్టపోతున్నారని గ్రహించాడు.
గత కొంత కాలంగా పార్టీలో చోటుచేసుకుంటున్న అనేక సమస్యలపై బాబు దృష్టి సారించారు.ఇటీవల పార్టీ కార్యక్రమాల విషయంలో నాయకులు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం, కేవలం పార్టీలో ఉంటాము తప్ప, పార్టీ కార్యక్రమాలకు తమకు సంబంధం లేదన్నట్లుగా కొంతమంది నాయకులు వ్యవహారశైలి ఉండడం, ఇవన్నీ బాబు గుర్తించారు.
అందుకే తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని, ఈ మేరకు జిల్లాల్లో పర్యటన చేసేందుకు ఆయన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు.అయితే ఇదే సమయంలో కరోనా వైరస్ తీవ్రత బాగా పెరిగిపోవడంతో, బాబు టూర్ ప్లాన్ దెబ్బతింది.
ప్రస్తుతం లోకేష్ తో పాటు, చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.ఆ టూర్లు ప్లాన్ చేద్దాం అన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదరని పని అన్నట్లుగా పరిస్థితి ఉంది.
కొద్దికాలం క్రితమే పార్టీ పదవుల భర్తీ పెద్ద ఎత్తున చేపట్టినా, కొంతమంది నాయకులు తప్ప మెజారిటీ నాయకులు ఉత్సాహంగా లేకపోవడం , వారికి పదవులు ఇచ్చినా, దండగ అన్నట్లు వ్యవహరిస్తూ వస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట.అవసరమైతే మరోసారి పార్టీ పదవుల విషయంలో ప్రక్షాళన మొదలు పెట్టాలని చూస్తున్నారు.కానీ కరోనా తీవ్రత కారణంగా బాబు ప్లాన్ వర్క్ అవుట్ కాకుండా, అడ్డు పడుతున్నట్లు గా పరిస్థితి ఏర్పడింది.