టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా మరింత వేడి పెంచేందుకు సిద్ధమైపోయారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు , మంత్రులు, ఎమ్మెల్యేలు తనను అవమానించిన తీరు పై రగిలిన బాబు, ఇక ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ఉండగా అడుగుపెట్టేది లేదు అని , తాను మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతాను అంటూ శపథం కూడా చేశారు.
ఇక పూర్తిగా జనాల్లోకి వెళ్ళి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ముఖ్యంగా రాయలసీమ లో వాగులు వంకలు పొంగడంతో పాటు, వీధుల్లోకి భారీగా వరద నీరు చేరడం, భారీగా ఆస్తి ప్రాణ నష్టం చోటు చేసుకోవడం వంటి సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా నెల్లూరు , అనంతపురం, కడప జిల్లాలు ఈ ప్రభావానికి గురయ్యాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలోనూ ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది.ఇప్పటికే వరద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా జగన్ సందర్శించారు. అలాగే ఏపీ బీజేపీ నేతలు సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సైతం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి, సహాయచర్యలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఉంటే బాధితుల పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు అనే విధంగా ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని కలిగించి, తద్వారా వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలని లక్ష్యంతో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.
పనిలోపనిగా తనకు ఏపీ అసెంబ్లీ లో జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, రాజకీయాలకు దూరంగా ఉన్న తన సతీమణి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని , మహిళలంటే వైసిపి శ్రేణులకు ఏ మంత్రం గౌరవ, మర్యాదలు లేవు అని బాబు తన ప్రసంగాల్లో ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నారట.
ఇప్పటికే టిడిపి సోషల్ మీడియాలో ప్రభుత్వం కు వ్యతిరేకంగా అనేక పోస్టులు వైరల్ చేస్తుండగా టిడిపి సానుభూతిపరులు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు జగన్ పైన విమర్శలు చేస్తూ, చంద్రబాబు టిడిపి పై మరింత సానుభూతి పెరిగే విధంగా వ్యవహారాలు మొదలుపెట్టారు.