ఏదో ఒకటి చేసి ఏపీ సీఎం జగన్ పైన, ఆయన ప్రభుత్వం పైన జనాల్లో వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా గత కొంతకాలంగా టిడిపి ప్రయత్నాలు చేస్తోంది.మొదట్లో వైసిపి ప్రభుత్వంపై పోరాడేందుకు నాయకులు, కార్యకర్తలు కాస్త వెనకడుగు వేసినా, చంద్రబాబు ,లోకేష్ వంటి వారు తరచుగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ వివిధ సమస్యలపై స్పందిస్తూ వస్తున్నారు.
అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ పార్టీ కేడర్ లో ఉత్సాహాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.గతంతో పోలిస్తే వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, జగన్ పరిపాలన పై పూర్తి స్థాయిలో సంతృప్తి గా లేరు అనే అభిప్రాయాలు కలుగుతుండడం తో వైసీపీ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు, ఆ పార్టీ గ్రాఫ్ తగ్గించేందుకు ఇదే సరైన సమయంగా బాబు భావిస్తున్నారు.
అందుకే ప్రాంతాలవారీగా వివిధ సమస్యలను హైలెట్ చేస్తూ, మూకుమ్మడిగా తమ పార్టీ నాయకులు విమర్శలు చేయించాలని, ఈ విధంగా కోస్తా , ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో స్థానిక సమస్యలను హైలెట్ చేస్తూ, ప్రభుత్వంపై ఏకకాలంలో ఒత్తిడి పెంచాలని , దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ పై ఆదరణ పెరగడంతో పాటు, వైసిపి గ్రాఫ్ తగ్గించేందుకు అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారు. దీనిలో భాగంగానే మూడు ప్రాంతాల నాయకులకు కీలక సూచనలు చేశారట.
బాబు ఆదేశాలతో ఆయా ప్రాంతాల నాయకులు తమ కార్యాచరణను మొదలు పెట్టేశారు.నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన టిడిపి నేతలు వెలుగొండ ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ, వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
తమ ప్రాంతానికి జగన్ ప్రభుత్వం ఏ రకమైన అభివృద్ధి చేయలేదని, గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప, మరెక్కడా అభివృద్ధి కనపడటం లేదు అంటూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మరీ విమర్శలు చేశారు. అలాగే రాయలసీమ జిల్లాకు చెందిన నేతలు ఇదే విధంగా గళమెత్తారు.
రాయలసీమ ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని , ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి విమర్శలు చేశారు.ఇక ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ ,కృష్ణ, గుంటూరు తదితర జిల్లాల్లో స్థానికంగా నెలకొన్న అనేక సమస్యలను హైలెట్ చేస్తూ, టిడిపి నాయకులు నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ఈ విధంగా అన్ని ప్రాంతాల్లోనూ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం ద్వారా టిడిపి గ్రాఫ్ పెంచుకోవాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా సూచనలు చేసినట్టు కనిపిస్తోంది.ఈ ప్లాన్ సత్ఫలితాలు ఇస్తుండడం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది.