టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యవహారాలు ఎవరికి అంతుపట్టని విధంగా ఉంటాయి.పార్టీ అధికారంలోకి తెచ్చేందుకు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకునేందుకు బాబు పన్నే వ్యూహాలు ఆ విధంగా ఉంటాయి.2019 ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓటమి చెందిన దగ్గర నుంచి బాబు చాలా ఆందోళన లోనే ఉన్నారు.గతంలో ఎప్పుడూ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేకపోవడంతో పాటు, ఎన్నికల ఫలితాలు ఘోరంగా రావడం ఇవన్నీ గుర్తు తెచ్చుకుని బిజెపి , జనసేన పార్టీలో పొత్తు కోసం విరామం లేకుండా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.
జనసేన విషయాన్ని పక్కన పెడితే బీజేపీ మాత్రం టిడిపి తో పొత్తు పెట్టుకునేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.
పొత్తు కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, బిజెపి అగ్రనేతలు ఎవరూ దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదు.అయినా బాబు ఒకవైపు ప్రయత్నాలు చేస్తూనే , మరోవైపు కాంగ్రెస్ తోనూ సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది .2024 లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ప్రభావం పెద్దగా ఉండదని, బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తూ ఉన్నారని, అలాగే సొంతంగా బిజెపి అధికారంలోకి వచ్చేంత స్థాయిలో ఎంపీ స్థానాలను గెలవలేదని బాబు అంచనావేస్తున్నారు.ఒకవైపు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు కాంగ్రెస్ తోనూ సన్నిహితంగా మెలుగుతూ, రాబోయే రోజుల్లో ఎవరూ అధికారంలోకి వచ్చినా తమకు ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నారు.
అసలు ఎన్నికలకు ముందే ఈ రెండు పార్టీల పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చి, పొత్తుకోసం మరింతగా ప్రయత్నించాలని చూస్తున్నారట.అయితే బిజేపి తో పొత్తు అనేది బాబుకు తీరని ఆశగానే కనిపిస్తుంది.ఎందుకంటే టిడిపి పై బిజెపి ఏపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ థియేధర్ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
ఆ పార్టీ బద్వేలు నియోజకవర్గంలో కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరించింది అంటూ విమర్శలు చేస్తూనే, భవిష్యత్తులో ఎప్పటికీ టిడిపి బిజెపి పార్టీలు పొత్తు పెట్టుకోవు అని, ఇది అధిష్టానం మాట అని తేల్చిచెప్పడం తదితర పరిణామాలతో బాబు ముందుగానే మేల్కొని కాంగ్రెస్ తోనూ రహస్యంగా మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.