రాజకీయాలలో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నుంచి చాలా మంది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికార పార్టీలోకి జంప్ అయిపోతారు.దానికి ప్రజాభిప్రాయం అనే ఒక సాగు చెబుతారు.
సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడానికి, లేదంటే అధికార వ్యామోహంతో ఇలాంటి నాయకులు తరుచుగా పార్టీలు మారడం ఒక అలవాటుగా చేసుకుంటారు.అలాగే ఆయా పార్టీలు కూడా ఇలాంటి నేతలని ప్రోత్సహిస్తూ ప్రత్యర్ధి పార్టీలని దెబ్బ కొడుతూ ఉంటాయి.
రాజకీయ పార్టీలు ఎప్పుడు వారి గెలుపు కోసం కంటే పక్కోడి ఓటమి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు.గత ప్రభుత్వ హయాంలో వైసీపీ పార్టీ నేతలని చంద్రబాబు తన టీంలోకి చేర్చుకొని పదవులు సైతం కట్టబెట్టారు.
ఇప్పుడు ఇంచుమించు అదే బాటలో వైసీపీ పార్టీ కూడా వెళ్తుంది.
ఆ పార్టీ ఎమ్మెల్యేలని అధికార పార్టీ మద్దతుదారులుగా, మాజీలని తమ పార్టీ నేతలుగా మార్చేసుకుంటుంది.
ఇప్పటికే రాయలసీమ, కృష్ణ డెల్టా నుంచి చాలా టీడీపీ నాయకులని వైసీపీలోకి లాగేసుకున్నారు.తాజాగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు.ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ, ఎవరు వెళ్లిపోయినా టీడీపీకి ఏమీ కాదని ధీమా వ్యక్తం చేశారు.అధికార పార్టీ వేధింపులకు భయపడే చాలా మంది పార్టీ మారుతున్నారని అన్నారు.
భయపడో, ప్రలోభాల కోసమో పార్టీ మారడం పిరికితనమని చంద్రబాబు అన్నారు.రాబోయే 40 ఏళ్లకు అవసరమైన నాయకత్వాన్ని తయారు చేస్తామని, ఆ బాధ్యత, ఓపిక తనకు ఉన్నాయని చెప్పారు.
మళ్లీ అధికారంలోకి వచ్చాక వైసీపీకి వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు.