ఏపీలో రాజకీయాలు ఆషామాషీగా లేవు.వేడి మంటలు పుట్టిస్తున్నాయి.
ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా, అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది.
అధికార పార్టీకి ప్రజల్లో మద్దతు లేకుండా చేయాలని, తాము పైచేయి సాధించి వచ్చే ఎన్నికల నాటికి మరింత బలపడాలని టిడిపి ప్లాన్ చేస్తోంది.ఇక బీజేపీ కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
తెలుగుదేశం పార్టీ బలహీనమైతే తాము బల పడవచ్చనే అభిప్రాయంతో ఉంది.దీనిలో భాగంగానే వైసిపి, టిడిపిలను సమాన స్థాయిలోనే చూస్తూ, రాజకీయం నడుపుతోంది.
ఇదిలా ఉంటే, ఏపీ అధికార పార్టీ వైసిపి పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులను చేర్చుకుని ఆ పార్టీని బలహీనం చేయాలనే ఆలోచనలో ముందుకు వెళుతోంది.అలాగే పార్టీలోకి వచ్చి చేరే అవకాశం లేనివారు, టీడీపీలో బలమైన నాయకులు అనుకున్న వారిని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళుతోంది.
తాజాగా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన నారాయణ వ్యవహారం ఇప్పుడు వైసీపీ లో పెద్ద చర్చనే లేవదీస్తోంది.ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆయనను చేర్చుకునేందుకు జగన్ సముకంగానే ఉన్నారనే వార్తలు ఇప్పుడు వైసీపీలో పెద్ద చర్చను లేవదీస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులను వైసీపీలో చేర్చుకుంటే ఆ పార్టీకి కలిసి వస్తుంది కానీ, నారాయణ విషయంలో మాత్రం వైసీపీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయి.ఎందుకంటే నారాయణ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.
టిడిపి అధికారంలోకి రాగానే నారాయణ ను ఎమ్మెల్సీగా, మంత్రిగా చేసి కీలకమైన శాఖలు కట్టబెట్టారు.అప్పటి నుంచి నారాయణ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు.
ముఖ్యంగా రాజధాని అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో నారాయణ పేరు ఎక్కువగా వినిపించింది.ఆయనను టార్గెట్ చేసుకుని వైసీపీ విమర్శలు చేస్తూ వచ్చింది.నారాయణ ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని, వేలాది ఎకరాల భూమిని బినామీ పేర్లతో కొనుగోలు చేశారని, వైసిపి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది.అంతేకాకుండా వైసిపి అనుకూల మీడియా కూడా అనేక కథనాలను వండి వార్చింది.
ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి భూ కుంభకోణం పై విచారణ చేస్తోంది.ఈ సమయంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న నారాయణను పార్టీలో చేర్చుకుంటే వైసిపి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు.
ప్రభుత్వం చేయిస్తున్న దర్యాప్తులో నారాయణ పేరు ఖచ్చితంగా ఉంటుంది.అలాగే నారాయణ విద్యా సంస్థలు అనేక అక్రమాలకు పాల్పడుతున్నాయి అని, ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని గతంలో వైసీపీ ఆయనపై ఎన్నో విమర్శలు చేసింది.
ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్ల మాఫియాను కట్టడి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కఠినంగా ముందుకు వెళ్తోంది.ఈ సమయంలో నారాయణను వైసీపీలో కనుక చేర్చుకుంటే చాలా రకాల విమర్శలు వైసిపి ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆర్థికంగా బలమైన వ్యక్తే అయినా నారాయణ గత టీడీపీ ప్రభుత్వంలో వ్యవహరించిన తీరు, ఎదుర్కొన్న ఆరోపణల దృష్ట్యా ఇప్పుడు ఆయనకు వైసీపీ కండువా కప్పితే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు అనే సూచనలు ఎన్నో వైసీపీకి అందుతున్నాయి.