కరోనా వైరస్ వ్యవహారాన్ని ఆషామాషీగా అయితే తీసుకోవడానికి వీలు లేదు.ముఖ్యంగా వయసు పైబడిన వారు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.
ఇదే విషయాన్ని వైద్య నిపుణులు సైతం పదే పదే చెబుతున్నారు.అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు లాక్ డౌన్ ముందు నుంచి హైదరాబాద్ కి పరిమితం అయిపోయారు.
ఏడు పదుల వయస్సు దాటడంతో ఆరోగ్యరీత్యా ఆయన విశ్రాంతి తీసుకోవడమే బెటర్ అన్న సూచనలతో ఏపీకి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు.కేంద్రానికి మొక్కుబడిగా దరఖాస్తు చేసుకున్నా, మనస్ఫూర్తిగా ఏపీకి వచ్చేందుకు పెద్దగా ఇష్టపడలేదు.
మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారాలు, వ్యూహాలు, మీడియా సమావేశాలు అన్ని తన ఇంటినుంచే టెక్నాలజీని ఉపయోగించుకునే బాబు ఏపీలో లేకపోయినా ఉన్నట్టుగా హడావుడి అయితే సృష్టించగలిగారు.
నిస్తేజం లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు.
లాక్ డౌన్ సమయంలోనూ పార్టీ కార్యకర్తలతో వారి ఇళ్ల నుంచే దీక్షలు చేసి ప్రభుత్వంపై పోరాడేలా బాబు చేయగలిగారు.చంద్రబాబు ఏపీలో లేని లోటు స్పష్టంగా కనిపించినా, టీడీపీ నాయకుల దీక్షలు, కార్యక్రమాలు ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేసినా అనుకున్నంత స్థాయిలో మైలేజ్ రాలేదన్నది చంద్రబాబు కు అందిన రిపోర్ట్.
ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం అనేక సమస్యలతో సతమతమవుతూ కనిపించింది.ముఖ్యంగా మద్యం, విద్యుత్ బిల్లుల పెరుగుదల వంటివి తెలుగుదేశం పార్టీకి పోరాడేందుకు చక్కటి ఆయుధాలుగా కనిపించాయి.
ఈ సమయంలో తాను ప్రత్యక్షంగా ఏపీలో లేకపోతే ఆశించినంత స్థాయిలో ఫలితం ఉండదని, కార్యకర్తల్లో ఉత్సాహం ఉండదనే ఆలోచనతో చంద్రబాబు ఏపీలో అడుగు పెట్టినట్లు తెలుస్తోంది.అదీ కాకుండా మహానాడును నిర్వహించడం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు మహానాడులో అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు ఉండటంతో తాను హైదరాబాదులో ఉండే కంటే, ఏపీలో ఉంటేనే రాజకీయంగా తమ ప్రత్యర్థి అయిన వైసీపీని ఇరుకున పెట్టవచ్చు అనేది చంద్రబాబు ఆలోచన.అందుకే తన ఇగోలు సైతం పక్కనపెట్టి ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని మరి అమరావతిలో వాలిపోయారు.
ప్రభుత్వానికి ఊపిరి ఆడనివ్వకుండా గ్యాస్ బాధితుల పరామర్శ, తిరుమల తిరుపతి దేవస్థానం భూముల అమ్మకం, విశాఖ గుంటూరు లో ప్రభుత్వ భూముల అమ్మకాలు, విద్యుత్ బిల్లులు వంటి అనేక సమస్యల మీద స్వయంగా తానే గళమెత్తి ప్రభుత్వానికి ఊపిరాడనివ్వకుండా చేయాలనే ఆలోచనతో చంద్రబాబు సిద్ధమవుతున్నారు.దీని ద్వారా కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని, వరుస వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న వైసీపీ ప్రభుత్వాన్ని మరింత ఇబ్బంది పెట్ట వచ్చు అనేది చంద్రబాబు ఆలోచన గా ఉంది.