మరో పది మాసాల్లో రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి.చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు.
ముఖ్యంగా కొందరు నేతలు పార్టీ లో ఉండి కూడా ప్రయోజనం లేదని అలాంటి వారిని వదిలించుకోవాలని ఆయన నిర్ణయించుకు న్నారు.ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా ఆయన సర్వే అంటూ ఊదరగొడుతున్నారు.
సర్వేలో మార్కులు సరిగా రాకపోతే.వారి భరతం పడతానంటూ.
బాబు ఎగిరి పడుతున్నారు.ఇక, అయినా కూడా ఎమ్మెల్యేలు లైన్లోకి రాలేదు.
దీంతో బాబు ప్లేట్ ఫిరాయించారు.తాను ఏరేయాలని నిర్ణయించుకున్న నేతలకు స్వయంగా తానే ఫోన్ చేస్తానని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే ఆయన జిల్లాల వారీగా పార్టీ సమన్వయ కమిటీలతో సమావేశమవుతున్నారు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీపై పట్టు బిగించాలని బాబు నిర్ణయించుకున్నారు.రోజుకు నాలుగు నుంచి అయిదు గంటల పాటు ఉండవల్లిలోని తన నివాసం పక్కనే ఉన్న పరిష్కార వేదికలో పార్టీ పనులపై వివిధ నేతలతో సమావేశం అవుతున్నారు.పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలను ప్రారంభించనున్నారు.
ఈలోపు పార్టీ వ్యూహకమిటీలతో కూడా చంద్రబాబు సమావేశం అవుతున్నారు.ప్రతిరోజూ ఉదయం పరిష్కార వేదికలో పార్టీ అంశాలపై చర్చిస్తున్నారు.
ప్రతిపక్షాల వ్యూహానికి ప్రతివ్యూహం రూపొందించుకుంటున్నారు.మంత్రులు.ఎమ్మెల్యేలు.ఎంపీలు… జిల్లా పార్టీ అధ్యక్షులు.ఇన్ఛార్జ్లు.పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
సమన్వయ కమిటీ సమావేశంలో మూడు నుంచి నాలుగు గంటలు ఉండాల్సి రావడంతో కొంతమంది ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారు.మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు.
వీటిపై మొన్నటికి మొన్న జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబుకు కోపం వచ్చింది.సమన్వయ కమిటీ సమావేశం ముగింపు సమయంలో గుంటూరు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు.
వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్యమంత్రితో మాట్లాడారు.ఆయన మాట్లాడే సమయంలో గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనతో పాటు మరో ఇద్దరు నేతలు మాత్రమే ఉన్నారు.
ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు.తన నివాసంలో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాలులో గుంటూరు పార్టీ కార్యాలయంలో ఉన్న దృశ్యాన్ని తెరపై చూసిన ముఖ్యమంత్రికి ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది.
మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదంటూ ఆంజనేయులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతేకాదు, వచ్చే సారి జరగనున్న సమన్వయ కమిటీ సమావేశానికి అందరూ రావాల్సిందేనని లేకుంటే చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరించడం గమనార్హం.
ఇక, నేతలకు స్వయంగా తానే పోన్ చేస్తానని కూడా బాబు చెప్పుకొచ్చారు.ఎవరు ఏం చేస్తున్నారో తనకు తెలుసని అన్నారు.అన్ని వివరాలు సమగ్రంగా చెబుతానని అన్నారు.దీంతో ఎవరికి ఫోన్ వస్తుందోనని హడలిపోతున్నారు.
ఇప్పుడు టీడీపీలో ఫోన్ టాపిక్ బాగా నడుస్తోంది.కానీ, ఇది పార్టీకి మంచిది కాదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
మరి ఏం జరుగుతుందో చూడాలి.