‘ఎవ్వడి కోసం ఎవడున్నాడు పొండిరా పొండి’….అన్నట్లుగా తయారైంది ఆంధ్రాలో భాజపా-టీడీపీ స్నేహ బంధం.
కాషాయ పార్టీ భాజపాపై బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.స్నేహ బంధం ఇంకా పూర్తిగా చెదరకపోయినా సంకేతాలు కనబడుతున్నాయి.
ఇద్దరి మధ్య విభేదాలు ముదురుపాకాన పడితే వచ్చే ఎన్నికల నాటికి ఎవరికివారైపోతారు.ఈ రెండు పార్టీల మధ్య ‘ప్రత్యేక హోదా’ చిచ్చు పెడుతోంది.
తాము అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసింది భాజపాయే కదా.ఈ మాట నమ్ముకునే బాబు భాజపాతో పొత్తు పెట్టుకున్నాడు.కాని కమలనాథులు అన్న మాటను అటకెక్కించారు.రోజూ మాటలతో కాలం గడుపుతున్నారు.ఈ వైఖరి బాబుకు విసుగు కలిగిస్తోంది.భాజపాపై తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది.
ఈమధ్య పార్లమెంటులో ఓ మంత్రి ‘ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద పెండింగులో లేదు’ రాత పూర్వకంగా సమాధానం ఇవ్వడంతో రాష్ర్టం అట్టుడికిపోయింది.ప్రజలు వీధుల్లోకొచ్చి నిరసన వ్యక్తం చేశారు.
అసలే కోపంగా ఉన్న బాబు టీటీడీ పాలకమండలిలో భాజపా సభ్యులకు చోటులేకుండా చేశారు.విజయవాడ కనకదుర్గ ఆలయ పాలకమండలిలోనూ స్థానం ఇవ్వలేదు.
దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సంహులుకు ఇవ్వాలనుకున్న గవర్నర్ పదవిని పెండింగులో పెట్టింది.అంటే యుద్దానికి బీజాలు పడినట్లే కదా.