అధికార పార్టీ గా ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయ్యింది.అధికారంలో ఉండగా ప్రజల మద్దతు పొందేందుకు రాబోయే ఎన్నికల్లో గట్టెక్కేందుకు పసుపు కుంకుమ, నిరుద్యోగ భృతి, పెన్షన్ పెంపు ఇలా ఎన్నోసంక్షేమ పథకాలను అమలు చేసింది అప్పటి టిడిపి ప్రభుత్వం.
ఆ ధీమాతో ఎన్నికల్లో గట్టెక్కేస్తామని భావించింది.కానీ టీడీపీ ఆశలు అడియాసలు అయ్యేలా చేదు ఫలితాలే మిగిలాయి.
దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం క్యాడర్లో పూర్తిగా నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి.దీని కారణంగానే పార్టీకి అంటి ముట్టనట్టుగా తెలుగు తమ్ముళ్లు దూరం పాటిస్తూ వస్తున్నారు.
వారిలో నూతన ఉత్సాహం పెంచేందుకు కు అధినేత చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం మాత్రం ఆశాజనకంగా ఉండడం లేదు.
ఇప్పటి వరకు పార్టీని ఉపయోగించుకుని కీలక నాయకులుగా ఎదిగి, ఆర్థికంగా బలపడిన వారు పార్టీకి దూరంగా ఉండడం, ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నిస్తూ ఉండడం చంద్రబాబుకు అసహనాన్ని కలిగిస్తున్నాయి.ఒక వైపు చూస్తే బాబు రిటైర్మెంట్ వయసు కూడా దాటిపోయింది.ఒకరకంగా చెప్పాలంటే ఆయన శక్తికి మించి కష్టపడుతున్నాడు.
ఇటువంటి సమయంలో పార్టీని ముందుండి నడిపించాల్సిన నాయకులు వెనకడుగు వేస్తూ కిందిస్థాయి నాయకులు మరింత అభద్రతా భావాన్ని పెంచుతున్నారు.తెలుగుదేశం పార్టీ ఇప్పుడప్పుడే కోలుకోలేదు.పార్టీకి పునర్వైభవం అసాధ్యం అన్న సంకేతాలు బలంగా వీస్తుండడంతో మరింత గందరగోళం పార్టీలో నెలకొంది.
దీని కారణంగానే ఏపీలో పెద్దగా బలం లేని బిజెపిలో చేరేందుకు కూడా సీనియర్ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వెనుకాడడం లేదు.పార్టీని పటిష్ట పరిచి కార్యకర్తల్లో ఉత్సాహం పెంచే విధంగా చంద్రబాబు చర్యలు చేపట్టకపోతే టిడిపి మరిన్ని కష్టాల్లోకి వెళ్లడం మాత్రం ఖాయమే అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి.అధికార పార్టీ చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు హైలెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు చేద్దామంటే ముందుకు వచ్చేందుకు నాయకులు ఇష్టపడడంలేదు.
ఇప్పుడు అనవసరంగా హైలెట్ అయితే జగన్ ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొని అన్నిరకాలుగా నష్టపోవాలనే భయం అందరిలోనూ నెలకొంది.ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకుల్లో హుషారు ఏ విధంగా తీసుకురావాలనే ప్రశ్నకు బాబు దగ్గర సమాధానం ప్రస్తుతానికి కరువయ్యింది.