ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి.వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యింది.2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని రికార్డు స్థాయిలో మెజారిటీని ఆ పార్టీ సొంతం చేసుకుంది.అయితే మొన్నటివరకు వైసీపీ పాలపై వ్యతిరేకత లేదని అధికార పార్టీ నేతలు చంకలు గుద్దుకున్నారు.
ఏదో కరోనా పుణ్యమా అని గత రెండేళ్లు ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే పరిస్థితులు లేవు.దీంతో ప్రజల్లో వ్యతిరేకతను వైసీపీ నేతలు ఊహించలేకపోయారు.
ఇప్పుడు గడప గడపకు కార్యక్రమం పుణ్యమా అని తమపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో వైసీపీ నేతలే కళ్లారా చూస్తున్నారు.ఇంకా రెండేళ్లు అధికారం వెలగపెట్టాల్సిన పరిస్థితుల్లో ఆ పార్టీకి వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఉన్నట్లు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతకు అన్ని కారణాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఓ రేంజ్లో మండిపడుతున్నాయి.
అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా ఏపీకి రాజధాని ఏదో ప్రజలకే కాదు వైసీపీ నేతలకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు.
మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.దీంతో అనూహ్యంగా ప్రతిపక్ష పార్టీ టీడీపీకి గ్రాఫ్ పెరుగుతోంది.అయితే చంద్రబాబు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా లేదా స్వయంకృతాపరాధంతో ప్రజల్లో వచ్చిన స్పందనను నాశనం చేసుకుంటారా అన్నదే కీలకంగా మారింది.
గతంలో తెలంగాణలో ఓటుకు నోటు కేసుతో అనవసరంగా ఏపీలోనూ చంద్రబాబు తలనొప్పులు తెచ్చుకున్నారు.ఆ వ్యవహారంతో తెలంగాణలో పార్టీ పూర్తిగా వాష్ అవుట్ అయిపోయింది.ఇప్పుడు ఏపీలోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆ పార్టీలో లీడర్లు లేరు.
సీఎం రమేష్, సుజనా చౌదరి, రావెల కిషోర్ బాబు, అవంతి శ్రీనివాస్, వల్లభనేని వంశీ మోహన్ లాంటి నేతలు టీడీపీకి దూరమయ్యారు.అయినా ఆ పార్టీకి ప్రజల్లో మంచి స్పందన ఉందంటే కారణం చంద్రబాబు ఒక్కరే.
వచ్చే ఎన్నికల దృష్ట్యా ఇప్పటికిప్పుడు చంద్రబాబు అతి జాగ్రత్తలకు పోయి ఎలాంటి ప్రత్యేక హామీలను ఇవ్వాల్సిన అవసరం లేదని.ప్రజల్లో వైసీపీపై ఉన్న వ్యతిరేకతే ఆయన ఆయుధంగా మార్చుకోవాలని రాజకీయ పండితులు సూచిస్తున్నారు.పదే పదే పొత్తుల గురించి మాట్లాడుతూ ఉన్న బలాన్ని తగ్గించుకోకుండా ఉంటే మేలని హితవు పలుకుతున్నారు.ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదని.వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకుని అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు