ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఏపీలో రాజకీయ పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎన్నో రకాలుగా కష్టాలు ఎదుర్కొంటున్నా, ఆ కష్టాలను అధిగమిస్తూ రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది.వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తూ, అనేక లోపాలను ఎత్తి చూపిస్తూ, నిత్యం హడావుడి చేస్తున్నారు.
ఏడు పదుల వయసు దాటినా చంద్రబాబు ఇంకా యాక్టివ్గానే క్షేత్రస్థాయిలో పర్యటించి, పార్టీ నాయకుల్లో ఉత్సాహం పెంచే పనిలో ఉన్నారు.మొదట్లో పార్టీ నాయకుల్లో చురుకుదనం లేకపోయినా, ప్రస్తుతం చంద్రబాబు చర్యలతో ఎక్కడికక్కడ ఊపు పెరిగింది.
త్వరలోనే తిరుపతి ఉప ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో ముందు నుంచి తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళుతోంది.ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికలలో గెలిచి తీరాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది.
అక్కడ గెలవకపోతే తర్వాత టిడిపి రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో తేడా వస్తే పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం బాగా పెరిగిపోతుందని బాబు భయపడుతున్నారు.ఇప్పటికే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ అభ్యర్థిని ప్రకటించేశారు.
ఏదో రకంగా ఆ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారు.ఇదిలా ఉంటే బిజెపి, జనసేన కూటమి యాక్టివ్ అవ్వడం, గతంతో పోలిస్తే బీజేపీ బలం బాగా పెరగడం టిడిపికి ఆందోళన కలిగిస్తోంది.
అందుకే ఆ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా, అధికార పార్టీ వైసిపిని ఎదుర్కొంటూ పట్టు సాధించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఈ నెల 21వ తేదీ నుంచి పది రోజుల పాటు తొలివిడతలో 700 గ్రామాల్లో ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు నుంచి సూచనలు అందాయి.టిడిపి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేయాలని, అలాగే వైసిపి ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపించాలని, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.తిరుపతిలో వైసిపి బాగా బలంగా ఉండడంతో, ఆ పార్టీని ఘోరంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు.
ఇప్పటికీ ఏపీలో ఆలయాల దాడులు వ్యవహారంపై ఫోకస్ పెంచి తిరుపతి పట్టు సాధించాలని చూస్తోంది.ఇక్కడ కనుక ఫలితాలు తేడా వస్తే టీడీపీ మర్రిన్ని కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.