తెలుగుదేశం పార్టీని అన్ని రకాలుగా దెబ్బతీయడమే ఏకైక లక్ష్యంగా అధికార పార్టీ వైసిపి ముందుకు వెళుతోంది.తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా పోగొట్టడంతో పాటు ఆ పార్టీలో కీలక నాయకులను తమ పార్టీలో చేర్చుకోవాలని, అలాగే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన వారిని, కీలక నాయకులను టార్గెట్ చేసుకుని గత టిడిపి ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి అక్రమాలను బయటకు తీసి, వారిని జైలుపాలు చేయాలనే ఉద్దేశంతో వైసిపి ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.
ప్రస్తుతం టిడిపికి చంద్రబాబు తర్వాత పెద్ద దిక్కుగా ఉంటూ అధికార పార్టీపై విమర్శలు చేయడంలో ముందుంటూ వస్తున్న మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ను ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టు చేయడంతో తెలుగుదేశం పార్టీలో ఆందోళన మొదలైంది.ఆయనే కాకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆర్థిక అండదండలు అందిస్తున్న నాయకులందరినీ టార్గెట్ చేసుకుని వైసిపి ప్రభుత్వం వారి అక్రమ వ్యవహారాలను, అవినీతి కార్యకలాపాలను తవ్వి తీస్తోంది.
వైసీపీ ప్రభుత్వం తమను ఆషామాషీగా వదిలిపెట్టదని, జైలుకు పంపించే వరకు నిద్రపోదు అనే అభిప్రాయానికి వచ్చిన చాలామంది నాయకులు ఇప్పుడు టీడీపీని వీడి అధికార పార్టీ లోకి వెళ్లడమో లేక టిడిపికి రాజీనామా చేసి సైలెంట్ గా ఉండడమో బెటర్ అన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.మరికొద్ది రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ఓటింగ్ లో పాల్గొనకుండా చేయాలనే ఉద్దేశంలో వైసీపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది.
కనీసం ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలను ఆ సమయంలో టిడిపికి రాజీనామా చేయించాలని చూస్తోంది.నియోజకవర్గాల్లో బలమైన నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలను పార్టీలో చేర్చుకుని తెలుగుదేశం పార్టీకి ఝలక్ ఇవ్వాలని చూస్తోంది.
కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు వ్యవహారంలో చంద్రబాబు తీవ్రంగా ఆందోళన చెందినట్టు తెలుస్తోంది.ఆయనకు ఆర్థికంగా అన్ని రకాలుగా మేలు చేసినా ఆయన పార్టీని వీడడం చంద్రబాబు తట్టుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఇప్పుడు ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు వైసిపి వైపు చేస్తుండడంతో వారు కనుక పార్టీకి రాజీనామా చేస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుందని, ప్రస్తుతం టీడీపీ నాయకుల అవినీతి వ్యవహారాలను జగన్ తవ్వి తీస్తుండడంతో పార్టీ కేడర్ లో భయాందోళనలు రేకెత్తి వైసిపి ప్రభుత్వం కు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చే అవకాశం లేదని, ఇలా ఎన్నో రకాల ఆలోచనల్లో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి పార్టీలో ఉన్నవారు కూడా ఇప్పుడు పక్క చూపులు చేస్తుండడంతో చంద్రబాబుకు మింగుడు పడడం లేదు.
వారు అంత భయపడే రేంజ్ లో అధికార పార్టీ వారిని భయపెడుతోంది అని, పరిస్థితి ఇలాగే ఉంటే ముందు ముందు టిడిపికి రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.ఈ విషయంపై ప్రజల్లోకి వెళ్లి వైసీపీ చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని, పార్టీ నాయకులకు భరోసా కల్పించాలని చూస్తున్నారు.70 ఏళ్ల వయసులో తాను ప్రశాంతంగా, తెరవెనుక ఉండి రాజకీయాలు చేద్దామంటే కుదరడం లేదని, వైసీపీ ఎప్పుడు ఏ స్టెప్ తీసుకుంటుందో తెలియక నిత్యం టెన్షన్ పడుతున్నట్టు చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది.