ప్రస్తుతం దేశంలోనే చంద్రబాబును మించిన రాజకీయ వ్యూహ కర్త లేడని అంటున్నారు విశ్లేషకులు.ఆయన వేసిన ఒకే ఒక్క బాణం.
ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది.బాబు వ్యూహంతో కేంద్రంలోని మోడీ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక, ఏపీ విషయానికి వస్తే.వచ్చే ఎన్నికల్లోనూ తానే విజయం సాధించి సీఎం సీటును దక్కించుకోవాలని బాబు భావిస్తున్నారు.
అయితే,బాబుకు ఏపీలో ఇద్దరు కీలక నాయకులు గట్టి పోటీ ఇస్తున్నారు.వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్లు బాబును గద్దెదింపి.
తాము అధికారంలోకి వచ్చేందుకు ఎవరికి వారే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలోనే చంద్రబాబు మరింత పకడ్బందీగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీకి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉన్న బీసీ వర్గాన్ని ఆయన మరింతగా పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలోనే `జయహో` బీసీ పేరుతో చంద్రబాబు వ్యూహాత్మకంగా బీసీ ఓట్లకు గేలం వేయాలని భావించారు.దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు.డిసెంబరు 30న రాజమహేం ద్రవరంలో భారీ ఎత్తున దీనిని నిర్వహించనున్నారు.‘దేశంలో సగం… టీడీపీతో మనం’ అన్న నినాదంతో ఈ సభను జరపనున్నారు.ఈ సభ జరగడానికి ఉన్న నలభై రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘జయహో బీసీ’ సదస్సులు జరపాలని, బీసీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాల గురించి వారి వద్దకు వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని నిశ్చయించారు.
వాస్తవానికి టీడీపీకి మొదటి నుంచి బీసీలే వెన్నెముక.వారికి గుర్తింపు, అధికారంలో భాగస్వామ్యం ఇచ్చింది టీడీపీయే.ఎన్టీఆర్ వారిని రాజకీయంగా బాగా ప్రోత్సహించారు.ఆదరణ వంటి పథకాలతో ఇప్పుడు చంద్రబాబు సైతం వారికి ఆర్థిక చేయూతనిచ్చారు.పేదరికంపై గెలుపు కార్యక్రమం కింద 8 లక్షల మందికి వివిధ వస్తు పరికరాలు ఇచ్చారు.దీనికి రూ.4 వేల కోట్లు ఖర్చుచేశారు.ఇంత పెద్దఎత్తున దేశంలో ఎవరూ చేయడం లేదనేది నిజమే.
ఇప్పుడు దీనిని ఆసరా చేసుకుని పవన్, జగన్లకు చెక్ పెట్టే దిశగా బాబు వ్యూహం వేశారు.రాష్ట్రంలో బీసీ ఓటర్లు కీలక శక్తిగా ఉన్న నేపథ్యంలో వారిని టీడీపీకి అనుకూలంగా చక్రం తిప్పేలా చేయాలని నిర్ణయించారు.
ఇప్పుడు తెరమీదికి వచ్చిన జయహో బీసీ విజయవంతం అయితే, చంద్రబాబు కు తిరుగులేదని అంటున్నారు విశ్లేషకులు.మరి ఏం జరుగుతుందో చూడాలి
.