ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అన్ని విషయాల్లోనూ పైచేయి సాధించాలని చూస్తూ ఉంటారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్థి అయిన అధికార పార్టీ వైసీపీని అన్ని విషయాల్లోనూ అభాసుపాలు చేయాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు.
ఆ ప్రయత్నాలకు తగ్గట్టుగానే వైసీపీ ప్రభుత్వం కూడా కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ టీడీపీకి అస్త్రాలను అందిస్తోంది.తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ధారక ఆస్తుల వ్యవహారంలోనూ వైసీపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడంలో టీడీపీ పైచేయి సాధించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ధారక ఆస్తుల విషయంలో బిజెపి నాయకులు ఎక్కువగా స్పందిస్తున్నారు.ముఖ్యంగా ఈ వ్యవహారం బిజెపి నాయకుల్లో విభేదాలకు కారణంగా కనిపిస్తోంది.
ఏపీ తెలంగాణ బిజెపి రాష్ట్ర స్థాయి నాయకుల వ్యవహారంపై జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా గందరగోళం సృష్టించేందుకే ఇలా వ్యవహరిస్తోందని , చంద్రబాబు వ్యూహం లో బిజెపి నాయకులు చిక్కుకున్నారని ఆయన మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది.ఈ సందర్భంగా ఆయన కొన్ని కొత్త విషయాలను తెరపైకి తెచ్చారు ఉత్తరాఖండ్ లో బిజెపి ప్రభుత్వం ఆలయ ఆస్తులను విక్రయించి దాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని సుబ్రహ్మణ్యస్వామి ఈ సందర్భంగా ప్రస్తావించారు.అప్పట్లో ఈ విషయంపై ఎవరూ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.
బద్రీనాథ్, కేదారనాథ్ వంటి అత్యంత ప్రాచీన ఆలయాలతో నిండి ఉన్న ఉత్తరాఖండ్ కు దేవభూమిగా పేరు ఉందని, అటువంటి చోట బిజెపి ప్రభుత్వం ఆలయ ఆస్తులను అమ్మకానికి పెట్టినా ఎవరూ అప్పట్లో అడ్డు పడలేదని సుబ్రహ్మణ్య స్వామి చెప్పుకొచ్చారు.
కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి విషయంలో మాత్రం రాజకీయంగా రచ్చ జరుగుతోందని ఇదంతా చంద్రబాబు పన్నిన వ్యూహం అంటూ సుబ్రహ్మణ్యస్వామి క్లారిటీ ఇచ్చారు.అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన బిజెపి సీనియర్ నాయకుడు, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు భానుప్రకాష్ పైన సుబ్రహ్మణ్యస్వామి విమర్శలు చేశారు.2016 లో టీడీపీ ఆస్తులు అమ్మకాలపై అనుకూలంగా తీర్మానం చేసినా, ఈ సమయంలో పాలకమండలిలో భానుప్రకాష్ సభ్యులుగా ఉన్నారని, అప్పుడు ఆయన అడ్డు చెప్పకుండా ఇప్పుడు ఈ అంశంలో విమర్శలు చేయడం ఏంటని సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు.అంతేకాదు టిటిడి విషయంలో ఇప్పుడు ఆందోళన చేస్తున్న వారంతా నిజమైన హిందువు అయితే ఉత్తరాఖండ్ కు వెళ్లి ఉపవాస దీక్ష చేయాలని ఆయన సూచించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిటిడి ఆస్తుల వేలం వేస్తే ఏపీ బిజెపి నాయకులు సమర్థించాలని, ఇప్పుడు మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటూ ఆయన ప్రశ్నించారు.తాజాగా టీటీడీ ఆస్తులను వేలం వేయడం నిలిపివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సుబ్రహ్మణ్యస్వామి ప్రశంసించారు.