2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఏపీలో టీడీపీ పరిస్థితి బాలేదనే చెప్పాలి.2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చరిత్రలో ఎప్పుడూ చూడని పరాజయాన్ని చవిచూసింది.175 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 23 స్థానాల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది.ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న వైసీపీకి మద్దతు ఇస్తూ ఉండటంతో రాష్ట్రంలో పార్టీ రోజురోజుకు బలహీనపడుతోంది.
తాజాగా టీడీపీకి సొంత పార్టీ నేత షాక్ ఇచ్చారు.పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీలో టీడీపీ బతకదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో పార్టీ తీరును తప్పుబడుతూ అయ్యన్న ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.టీడీపీ ఆఫీసుకు తాళం వేస్తే ప్రజలు ఏమనుకుంటారని… ఇలా చేయడం ద్వారా ఏ విధమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారని అయ్యన్న చంద్రబాబు శైలిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజాగా చంద్రబాబు ఉండవల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఈ కాన్ఫరెన్స్ లో అయ్యన్న తన మనస్సులోని బాధను వెళ్లగక్కారు.చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదని… పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని అయ్యన్న సూచించినట్లు సమాచారం.
ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి హైదరాబాద్ లో ఉండి కార్యకలాపాలు సాగించడం సరికాదని అయ్యన్న పేర్కొన్నట్టు తెలుస్తోంది.
ప్రచారం కోసం పని చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదని….
హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత వస్తుందని వ్యాఖ్యానించినట్లు సమాచారం.ఇదే విధంగా ముందుకెళితే భవిష్యత్తులో పార్టీని రక్షించడం సాధ్యం కాదని అయ్యన్న చెప్పినట్టు టీడీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అయ్యన్న పాత్రుడు సూచనలతో బాబు ఇకపై పూర్తిగా ఏపీలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.