లాక్ డౌన్ తో గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లోనే ఉండిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ లో పర్యటించాలి అని ఏపీకి రావడానికి సిద్దమైన విషయం తెలిసిందే.ఇటీవల జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటన నిమిత్తం బాధితులను పరామర్శించేందుకు ఆయన ముందుగానే అనుమతి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ రోజు విమాన సర్వీసులు కూడా పునరుద్ధరించడం తో బాబు హైదరాబాద్ నుంచి విశాఖ రావాలి అని బాబు ప్లాన్ చేసుకున్నారు.అయితే ఏపీ ప్రభుత్వ అభ్యర్ధన మేరకు ఏపీ లో ఈ రోజు నుండి కాకుండా రేపటి నుంచి విమాన సర్వీసులు నడిపేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతి ఇవ్వడం తో రేపటి నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
అయితే విమానాల ద్వారా వచ్చే వారిని క్వారంటైన్ కు తరలించే విషయంగా ఇంకా మార్గదర్సకాలు రెడీ కాకపోవడం తోనే విమాన సర్వీసులు వద్దు అని ఏపీ ప్రభుత్వం కోరినట్లు తెలుస్తుంది.దీనితో బాబు ముందుగా ప్లాన్ చేసుకున్న విశాఖ పర్యటన రద్దు అయ్యింది.
అయితే చంద్రబాబు విశాఖ పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో ఈ ఒక్క రోజు ఎయిర్ పోర్టులను మూసేయడం మీద టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇది కేవలం చంద్రబాబును అడ్డుకునే కుట్ర అని ఆ పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు.
చంద్రబాబుకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి, విమాన సర్వీసులను నిలిపేయడం వైసీపీ ప్రభుత్వ కుట్రగా ఆరోపించారు.మరోపక్క ఆయన ఏపీ కి రోడ్డు మార్గం ద్వారా వచ్చేందుకు డీజీపీ అనుమతి ఇవ్వడం తో ఈ రోజు ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకోనున్నట్లు తెలుస్తుంది.
అయితే ఏపీ కి చేరుకున్న తరువాత వెంటనే బాబుకు విశాఖ వెళ్లేందుకు అధికారులు అనుమతి ఇస్తారా లేదంటే మరేదైనా అభ్యంతరం వ్యక్తం చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.