తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంత రాజకీయ మేధావో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎటువంటి విపత్కర పరిస్థితినైనా సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో ఆయనకు ఆయనే సాటిగా నిలబడతారు.
గతంలోనూ టీడీపీ అనేక ఎదురుదెబ్బలు తింది.ఆ విపత్కర పరిస్థితుల నుంచి బాబు తెలివితేటలతో పార్టీ మళ్లీ పుంజుకోగలిగింది.
అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు తెలివితేటలు పనిచేయడంలేనట్టు కనిపిస్తున్నాయి.తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.
ఇక అక్కడ పార్టీని బలోపేతం చేసే విషయంలోనూ చంద్రబాబు చేతులెత్తేసినట్టుగా కనిపిస్తున్నారు.అయినా తమ ఉనికిని కాపాడుకునేందుకు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దించారు.
ఇక ఏపీ విషయానికి వస్తే వైసీపీ ప్రభుత్వం ఇక్కడ కొలువుతీరి నాలుగు నెలలవుతోంది.ఈ సమయంలో ప్రభుత్వంపై అనేక విమర్శలు పెరిగిపోయాయి.
అయినా టీడీపీ సమర్థవంతంగా విమర్శలు చేయలేకపోతోంది.ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అవ్వలేకపోతోంది.
ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఏంటి అనే సందేహం ఆ పార్టీ నేతల్లో ఎక్కువవుతోంది.జగన్ ప్రభుత్వంపై ఎదురుదాడి తప్ప మరేమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతోంది.
ఎన్నికలకు ముందు సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు అప్పటి విపక్ష నేతగా ఉన్న జగన్ ను ఎలా దూషించారో ఇప్పుడు కూడా అదేవిధంగా దూషిస్తున్నారు.వాటినే మీడియా ముందు కూడా చెప్పుకొస్తున్నారు.
దీంతో ప్రజల్లో ఇప్పటి వరకు ఏ అభిప్రాయం ఉందో టీడీపీపై అదే భావన కొనసాగుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వంలో ఉండగా చంద్రబాబు అనేక విషయాలపై ఎప్పటికప్పుడు అనేక నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అన్నిటిని పక్కనపెట్టేసినట్టుగా కనిపిస్తోంది.
ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఎటువంటి వ్యూహాలు వేయాలి ? ఏ విషయాలపై పోరాటాలు చేయాలి అనే విషయాలపై మాత్రం పెద్దగా దృష్టిసారించలేకపోతోంది.
ప్రజల్లో మంచి మార్కులు సాధించేందుకు ఏమి చేయాలి అనే విషయంలో ఎటువంటి క్లారిటీకి రాలేకపోతోందది.ఇప్పటి వరకు చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు ఎన్ని ఉద్యమాలు చేపట్టినా, జగన్ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా పెద్దగా ప్రజల నుంచి మద్దతు లభించడంలేదు.ఇటీవల గుంటూరు జిల్లాలోని ఆత్మకూరు దళితుల వ్యవహారం దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ల వరకు ఏ విషయంలోనూ వైసీపీని ఇరుకునపెట్టలేకపోయింది.
సరిగ్గా అదే సమయంలో గోదావరి నదిలో పడవ మునిగిన ఘటనకు సంబంధించి కూడా ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిలదీయలేకపోవడం ఆ పార్టీకి పెద్దగా కలిసిరాలేదు.ఇక ప్రమాద బాధితులకు పరిహారం విషయంలోకానీ, బాధ్యత విషయంలో కానీ, జగన్ అప్పటికప్పుడు స్పందించడంతో ప్రజల్లో టీడీపీ ఆరోపణలు పెద్దగా చర్చకు రాలేదు.
ఇక ఇదే పంథాలో ముందుకు వెళితే పెద్దగా కలిసొచ్చేది ఏమి ఉండదు అనే ఆలోచనకు బాబు కూడా వచ్చేసినట్టు కనిపిస్తోంది.అందుకే ముందుకు ముందు సరికొత్త రీతిలో ప్రభుత్వంపై పోరాటానికి దిగేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది.