పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు చాలా గోప్యంగా ఉంచుతారు టీడీపీ అధినేత చంద్రబాబు.కేవలం కొంతమంది సన్నిహితులకు మాత్రమే తన వ్యూహాలను చెబుతూ ఉంటారు.
వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన శక్తి సామర్ధ్యాలను సంపాదించేందుకు సరైన రాజకీయ వ్యూహంతో ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.అయితే టీడీపీ కి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు చాలా వరకు బయటకు లీక్ అయిపోతూ ఉండటం, అత్యంత విశ్వసనీయ సమాచారం కూడా అధికార పార్టీ నాయకులకు చేరి పోతుండడం పై గత కొంత కాలంగా చంద్రబాబు ఆరా తీస్తున్నారు.
ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ తరహా లీకులకు పాల్పడుతున్న వారు ఎవరా అనే విషయాన్ని అత్యంత గోప్యంగా ఆరాతీస్తున్నారట.
ఇటీవల కరోనా ఎఫెక్ట్ కారణంగా జూమ్ ద్వారా బాబు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశాల్లో కెమెరాలు ఆఫ్ అయినా, వీడియోలు బయటకు వెళ్తుండటం అవి వైరల్ గా మారడం , నేతలకు సంబంధించిన సంభాషణలు వైసీపీ మీడియా లో ప్రత్యక్షం అవుతూ ఉండటం, ఎలా ఎన్నో అంశాలతో పార్టీలోనే కోవర్టులు ఉన్నారనే విషయాన్ని చంద్రబాబు గుర్తించారు.ప్రస్తుతం ఆ లీకు వీరులు ఎవరు అని తెలుసుకునే పనిలో పడ్డారు.
పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సాంకేతిక సిబ్బంది తో పాటు మిగిలిన వారందరి పైన పూర్తిగా నిఘా పెట్టారట.
అలాగే ప్రస్తుతం టీడీపీ లోనే ఉంటూ వైసీపీ ప్రభుత్వానికి సహకరిస్తూ, భారీగా లబ్ధి పొందుతున్న కొంతమంది నేతలే ఈ తరహా వ్యవహారాలకు పాల్పడుతున్నారు అనే అనుమానం చంద్రబాబులోనూ నెలకొంది.వారే ఈ లీకులకు పాల్పడుతూ, పార్టీకి చేయాల్సినంత డ్యామేజ్ చేస్తున్నారని , అటువంటి వారిని గుర్తించి వెంటనే బయటకు పంపకపోతే మరింతగా పార్టీ దెబ్బతింటుందనే అభిప్రాయానికి బాబు వచ్చారట.