ఇటీవల చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీకి ఎదురు గాలి వీచింది.టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగిరింది.
అంతే కాదు ఎంతో మంది టీడీపీ వీరాభిమానులు వైసీపీ కండువా కప్పుకున్నారు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పెద్దఎత్తున టీడీపీ నాయకులను వైసీపీలో చేర్చుకున్నారు.
కుప్పం లో చోటుచేసుకున్న పరిణామాలు టీడీపీ అధినేత చంద్రబాబు లోనూ ఆందోళన కలిగించాయి.ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని, అందుకే ఆయన వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుండగా , ఈ రోజు ఆ నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా తన మనసులోని ఆవేదనను చంద్రబాబు బయటపెట్టారు.ఇటీవల కుప్పం లో జరిగిన ఎన్నికలు తనను బాధపెట్టాయని , డబ్బులు పంచిన తీరు ఎప్పుడూ లేదని, వెయ్యి రెండు వేలు పంచి ఓట్లు అడిగే పార్టీ కాదు టీడీపీ అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.
కుప్పం లో ఓటమి అంటూ తనను వైసీపీ నాయకులు ఎగతాళి చేశారని , నన్ను అంటే మిమ్మల్ని అన్నట్టు కాదా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.మనం కూడా ప్రలోభాలకు లొంగి పోతే ఎలా ? మనం బాగా పని చేయాలి.కుప్పంలో కోవర్టులను పంపేస్తా, ప్రక్షాళన చేస్తానంటూ చంద్రబాబు మాట్లాడారు.కుప్పంలో మనమంతా ఏకమైతే పోలీసులు ఏమీ చేయలేరని, కుప్పంలో కార్యకర్తల ఇష్టప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాను అన్నారు .మీరు వద్దన్నా నేతలను, నష్టం చేసే వారిని ఉపేక్షించనన్నారు.నేను నియోజకవర్గం మార్చాలా ? ఆ అవసరం ఉందా ? నేను కుప్పానికి ముద్దుబిడ్డను… కుప్పం వదిలి ఎక్కడికి పోను అంటూ చంద్రబాబు సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు.
తన కుటుంబ సభ్యుల పైన ఆరోపణలు చేసి వైసీపీ నాయకులు ఆనందం పొందుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.మళ్లీ సీఎంగానే సభకు వెళతానని చెప్పాను.సభా గౌరవం కాపాడుతాను.ప్రతిపక్షం పై తమిళనాడులో స్టాలిన్ ఎలా ఉన్నారు ఇక్కడ జగన్ ఎలా ఉన్నాడు అంటూ చంద్రబాబు తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.