పాత జ్ఞాపకాలను తలచుకొంటూ పదేపదే టీడీపీ అధినేత చంద్రబాబుపశ్చాత్తాప పడుతున్నట్లుగా కనిపిస్తున్నారు.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా పరిపాలనపై బాబు దృష్టి పెట్టడం, అమరావతితో పాటు, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించే అంశాలపై దృష్టి పెట్టడం, పూర్తిగా అధికారులకు పాలనా పగ్గాలు అప్పగించడం వంటి వ్యవహారాలతో పార్టీ శ్రేణులను పట్టించుకోనట్టుగా గత టీడీపీ ప్రభుత్వంలో బాబు వ్యవహరించారు.
దీంతో సాధారణంగానే అధినేత తీరుపై పార్టీ శ్రేణుల్లోనూ అసహనం బాగా పెరిగిపోవడమే కాకుండా, తీవ్ర అసంతృప్తులకు దారితీయడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటు చేసుకున్నాయి.
ఫలితంగా 2019 ఎన్నికల్లో టీడీపీకి అధికారం దూరమవడంతో, అసలు పార్టీ ఎందుకు ఓటమి చెందింది అనే విషయంపై చంద్రబాబు పదేపదే సమీక్షలు చేస్తూ, పార్టీ నాయకులతో చర్చిస్తూ, అసలు తప్పులు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసుకుంటూ, నష్టనివారణ చర్యలకు దిగుతున్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో, ప్రత్యక్షంగా పార్టీ నాయకులతో బాబు సమీక్ష, సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోయినా, టెక్నాలజీని ఉపయోగించుకుని జూమ్ యాప్ ద్వారా పార్టీ నాయకులతో బాబు అందుబాటులో ఉంటూ, అన్ని విషయాలపైన సమగ్రంగా చర్చిస్తున్నారు.
తాజాగా హిందూపూర్ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులతో సమీక్ష నిర్వహించిన బాబు, ఇవే అంశాలను ప్రస్తావించారట.
పార్టీ కోసం జెండాలు మోశారు.మోస్తున్నారు.
మిమ్మల్ని ఎప్పటికీ మరువను, పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తాను, గతంలో జరిగిన ఏ పొరపాట్లు ఇప్పుడు జరగకుండా చూసుకుంటాను అంటూ ఆయన భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలంతా గట్టిగా కష్టపడుతున్నారని, వారందరికీ పాదాభివందనం చేస్తున్నాను అంటూ బాబు చెప్పారట.
పార్టీ కార్యకర్తల పై ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తూ, అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, వీటన్నిటిపైనా, తెలుగుదేశం పార్టీ రాజీ లేకుండా పోరాడుతుందని భరోసా ఇచ్చారు.పార్టీ పరంగా టీడీపీ నాయకులు అందరికీ అండగా ఉంటామని, గతంలో జరిగిన తప్పులు ఏవీ మళ్ళీ చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటాము అంటూ బాబు పశ్చాత్తాపం వ్యక్తం చేశారట.