అమరావతిని రాజధానిగా మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వైసీపీ అధినేత జగన్ తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.అమరావతి కి బదులుగా విశాఖలో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించుకున్నారు.
అయితే టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు మొగ్గుచూపింది.వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుంది.
అయితే ఇదంతా సాధారణంగా జరిగిన ప్రక్రియ అని అంతా భావించారు.కానీ దీని వెనుక విస్తుపోయే నిజాలు ఉన్నట్టు తేలింది.
తాజాగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను బిజెపి- జనసేన బృందం కలిసిన సందర్భంగా ఆమె అమరావతి నిర్మాణం, ఏపీ ఆర్థిక పరిస్థితులపై ఈ బృందంతో చర్చించారు.ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు అమరావతికి రుణం ఇచ్చే అంశంపై చర్చ జరిగింది.
ప్రపంచ బ్యాంకు ప్రాసెస్ మొత్తం పూర్తిచేసిన వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి రాగానే రద్దు చేయడానికి గల కారణాలు ఏమిటి అనేది నిర్మల సీతారామన్ వివరించారు.కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అమరావతిని నిర్లక్ష్యం చేసే ఉద్దేశంతో ప్రపంచ బ్యాంకు రుణం తమకు అవసరం లేదన్నట్లుగా వ్యవహరించిందని, కేంద్ర ప్రభుత్వం ,ప్రపంచ బ్యాంకు ఇదే అంశంపై అనేక సార్లు సంప్రదించినా ఏపీ ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపలేదని, ఈ పరిస్థితుల్లో ప్రపంచబ్యాంకు వెనక్కి తగ్గినట్లుగా నిర్మల సీతారామన్ సదరు బృందానికి వివరించారు.
అమరావతి నిర్మాణానికి టిడిపి ప్రభుత్వం ‘అమరావతి సస్టెయినబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్’ పేరుతో 715 మిలియన్ డాలర్ల రుణం తీసుకునేందుకు అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రయత్నించింది.అంటే మన కరెన్సీలో 5 వేల కోట్ల తో సమానం.మరో రెండు వేల కోట్ల రుణం కోసం ఆసియా డెవలప్మెంట్ బ్యాంకుని సంప్రదించింది.ప్రపంచ బ్యాంకు తొలిదశలో సుమారు 2065 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
దీనిని తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చింది.ఆ సమయంలో ప్రపంచ బ్యాంకు ప్రతిపాదనను విరమించుకుంది.
దీనికి కారణం టిడిపి ప్రభుత్వం ఓడిపోవడమే కారణమనే సమాచారం కేంద్రానికి వచ్చిందట.అమరావతిపై గతంలో వచ్చిన అభ్యంతరాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు.దీనిపై కేంద్రం ఏపీకి లేఖ రాసింది.దీనిపై వైసీపీ ప్రభుత్వం స్పందిస్తూ ప్రభుత్వం దీనిపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరారట.
ఆ తరువాత కూడా కేంద్రం రాష్ట్రాన్ని మూడుసార్లు సంప్రదించినా సరైన స్పందన రాలేదని, పైగా ఇప్పుడు కేంద్రానిదే మొత్తం తప్పన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం భావిస్తోందని బిజెపి జనసేన బృందానికి నిర్మల సీతారామన్ వివరించినట్లు సమాచారం
.