తెలంగాణాలో ఉన్నా లేనట్టుగానే ఉన్న తెలుగుదేశం పార్టీ మళ్లీ పునర్వైభవం కోసం తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది.ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ మీద రోజురోజుకి ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్దగా గెలుపు అవకాశాలు ఉండవనే అంచనాకు టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చేశారు.
అందుకే ఇప్పుడు తెలంగాణ లో టీడీపీ ని బలోపేతం చేసేందుకు చంద్రబాబు సిద్దమయినట్టు తెలుస్తోంది.వాస్తవంగా చేస్తే తెలంగాణాలో టీడీపీ పనైపోయిందని భావనతోనే మెజార్టీ నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చేసారు.
అందుకే అక్కడ ఉన్న కీలక నాయకులు సైతం తమకు అనువైన పార్టీల్లో చేరిపోయారు.ఇక చంద్రబాబు కూడా ఎవరిని బుజ్జయించకుండా పూర్తిగా పార్టీ గురించి పట్టించుకోవడం మానేశారు.
దీంతో మిగిలి ఉన్న కొద్దిమంది నాయకులు సైతం రాష్ట్రంలో పార్టీని అధినాయకత్వం పట్టించుకోవడం లేదనీ, టీడీపీ ఉంటే భవిష్యత్తు ఉండదనీ, బాధగానే పార్టీని వీడుతున్నాం అంటూ చాలామంది కీలక నాయకులు పార్టీకి గుడ్ బాయ్ చెప్పేశారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాడు.పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే విధానంలో భాగంగా తెలంగాణ నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు.ఈ నెల 14న వారితో భేటీ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
ఇక నుంచి ప్రతీ శనివారం రాష్ట్ర నాయకులతో చంద్రబాబు సమావేశం అవుతారట.తెలంగాణ పార్లమెంటు నియోజక వర్గాల వారీగా సమావేశాలుంటాయని సమాచారం.
ఈ మేరకు త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి, ఎలా వ్యవహరించాలనే అంశంపై ప్రధానంగా తెలంగాణ నేతలతో చర్చించబోతున్నారట.దీంతో పాటు పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల పరాజయం గురించి కూడా నాయకులతో చర్చించేందుకు బాబు సిద్ధం అవుతున్నారట.
వాస్తవంగా తెలంగాణ టీడీపీ పరిస్థితి చూస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఎటువంటి సమీక్ష చేపట్టలేదు.కనీసం ఫలితాలు ఈ విధంగా ఎందుకు వచ్చాయి అనే దానిపై నామమాత్రపు సమీక్ష కూడా చేయలేదు.దీంతో, ఆ సమయంలోనే చాలా మంది టీడీపీకి చెందిన జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జిలు పార్టీని విడిచిపెట్టి బయటికి వెళ్లిపోయారు.ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దూరంగా తెలుగుదేశం పార్టీ ఉండిపోయింది.
దీంతో ఇతర నేతలకు కూడా నమ్మకం దాదాపు పోయిందనే చెప్పాలి.ఆ సందర్భంలో ఇలాంటి సమావేశం ఒక్కటైనా నిర్వహించి ఉంటే, పార్టీలో ఉన్న నాయకులకు ధైర్యం వచ్చి, భవిష్యత్తుపై ఎంతో కొంత భరోసా ఏర్పడేది.
కానీ ఇప్పుడు అంతా అయిపోయిందనుకుంటున్న సమయంలో బాబు ఇప్పుడు తెలంగాణ మీద దృష్టిపెట్టడం వల్ల ఎంతవరకు కలిసివస్తుందనేదే పెద్ద ప్రశ్నగా మారింది.
.