తెలంగాణాలో ముందస్తు ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ చాలా తహతహలాడింది… అంతా అనుకున్నట్టుగానే ప్రభుత్వాన్ని రద్దు చేయడం… ఎన్నికలకు వెళ్లడం ఇలా అంతా కేసీఆర్ వేసిన ప్లాన్ ప్రకారమే జరిగిపోయింది.అయితే ఇక్కడ కేసీర్ ఉపయోగించిన స్ట్రాటజీ ఏంటి అంటే… సిట్టింగ్ ఎమ్యెల్యేలందరికి దాదాపు టికెట్ లు ఇవ్వడం… అందరికంటేనే ముందుగా అభ్యర్థుల లిస్ట్ ప్రకటించడం… ఇలా అన్నీ… చక చకా జరిగిపోయాయి.
టీఆర్ఎస్ విజయానికి కూడా ఇది చాలా దోహదం చేసింది అనే చెప్పాలి.ఇక ప్రతి విషయంలోనూ….
కేసీఆర్ ను అనుసరించే చంద్రబాబు కూడా… అదేవిధంగా….ముందస్తుగా అభ్యర్థుల లిస్ట్ ప్రకటిస్తానని బాబు ప్రకటించాడు.
ఆ ప్రకటనే ఇప్పుడు టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి టీడీపీ అధినేత చంద్రబాబు కి చాలా వ్యత్యాసం ఉంది.అక్కడా ఇక్కడా రాజకీయ పరిస్థితులు వేరు.టీఆర్ఎస్ లో ఏం జరగాలన్నా… కేసీఆర్ ఇష్టం.
ఎంతటి సీనియర్ నాయకులైనా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు.వీటన్నింటితో పాటు ఆ పార్టీని ఒంటి చేత్తో గెలిపిస్తున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
కానీ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి వేరు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏకఛత్రాధిపత్యం చెల్లదు.దీనికి కారణం ఆయనతో పాటు చాలా మంది సీనియర్లు ఉన్నారు.పైగా చంద్రబాబు నాయుడు తన వారిని ఒక విధంగాను – తన వర్గం కాని వారిని మరో విధంగానూ చూస్తారనే పేరు కూడా బలంగా పార్టీ నాయకుల్లోకి వెళ్ళిపోయింది.అలాగే….ఏపీలో త్వరలో శాసనసభకు – లోక్ సభకు అభ్యర్ధులను ప్రకటిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పడంతో టిక్కట్లు రావేమోననే భయం కొందరు సీనియర్లను వెంటాడుతోంది.
అందుకే టికెట్ దక్కలేదు అనే అవమానం పడే కంటే… ముందుగానే తమకు టికెట్ ఇచ్చి సముచిత గౌరవం ఇచ్చే పార్టీలోకి వెళ్తే మంచిది అనే అభిప్రాయంలో కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది.ఈ విధంగా ఆలోచిస్తున్న వారు… ప్రతి జిల్లాలోనూ కనీసం ఇద్దరు ముగ్గురు ఉంటారని అంటున్నారు.దీనికి తోడు కొందరు సిట్టింగు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా టిక్కట్ రాదనే ఆందోళనలో ఉన్నారు.
అలాంటి వారు ముందే పార్టీ మారిపోతే మంచిదనే అభిప్రాయంలో ఉన్నట్టు చెబుతున్నారు.అదీ కాకుండా….పార్టీలో ఇప్పుడు ఉన్నవారంతా … వయస్సు మీరడం… ఇప్పుడున్న టెక్నాలజీ… సోషల్ మీడియా లో వెనుకబాడం తదితర కారణాలవల్ల యువ రక్తం టీడీపీకి ఎక్కించాలని బాబు భావిస్తున్నాడు.దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యువ నాయకులను తయారు చేసి లోకేష్ కి అండగా ఉండేలా బాబు ప్రణాళికలు వేస్తుండడం సీనియర్ నాయకుల్లో ఆందోళన పెంచుతోంది.