రాజకీయాల్లో ఉన్న వారికి కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, ప్రజలకు ఏదైనా చెప్పాలనుకున్నా వారికి ప్రధాన ఆధారం మీడియానే.ఇప్పటి వరకు రాజకీయ నాయకులంతా మీడియా ముఖంగానే తమ రాజకీయ నిర్ణయాలు, విమర్శలు చేస్తూ ఉంటారు.
అయితే తాను పూర్తిగా భిన్నం అన్నట్లుగా ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తుండడం చర్చనీయాంశమవుతోంది.ఇది ఒక రకంగా జగన్ కు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎన్ని సమస్యలు వచ్చినా, ఆరోపణలు వచ్చినా, ప్రశంసలు, విమర్శలు వచ్చినా జగన్ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి పోతున్నారు.
కేవలం జగన్ పార్టీలోని నాయకులు, క్యాబినెట్ లోని మంత్రులు మాత్రమే దేనిమీదైనా స్పందిస్తున్నారు.
జగన్ ఎక్కడా మీడియా ముందుకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు.ఏదైనా ప్రధాన సమస్య వచ్చినప్పుడు కేవలం అసెంబ్లీ లో మాత్రమే జగన్ దానికి సమాధానం చెబుతున్నారు.
అదే జగన్ స్థానంలో చంద్రబాబు ఉండి ఉంటే ఏ చిన్న సమస్య వచ్చినా ఆగమేఘాల మీద మీడియా సమావేశం నిర్వహించి మరీ తనకు క్రెడిట్ వచ్చేలా చేసుకునేవారు.ఏపీ నుంచి కియా పరిశ్రమ తమిళనాడుకు వెళ్ళిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కొద్దీ రోజుల క్రితం.
దీనిపై స్వయంగా కియా యాజమాన్యమే స్పందించి తాము ఎక్కడికి వెళ్లడం లేదని, ఏపీలో ఉంటామంటూ చెప్పుకుంది.
ఈ విషయంలో జగన్ కూడా స్పందించి ప్రతిపక్షం పై విమర్శలు చేసి ఉంటే వైసీపీకి మరింత క్రెడిట్ వచ్చేది.కానీ దానిని జగన్ పట్టించుకోలేదు.ఇక రాజధాని విషయంలో జగన్ ఇదే వైఖరి అవలంభిస్తున్నారు.58 రోజులుగా అమరావతి పరిసర ప్రాంత ప్రజలు దీక్షలు చేస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదు.దీంతో నిజంగానే ఆ ప్రాంత ప్రజలు జగన్ తమను పట్టించుకోవడం లేదన్న బాధ ఎక్కువగా కనిపిస్తోంది.
తాజాగా ఢిల్లీ వెళ్లిన జగన్ బీజేపీతో కీలక నిర్ణయాలపై క్లారిటీ తెచ్చుకున్నారు.ఇదంతా జగన్ కు బాగా కలిసొచ్చే అంశాలే.
ఢిల్లీ పెద్దలను కలిసిన తర్వాత మైలేజ్ వచ్చేలా చేసుకోవాల్సిన జగన్ మీడియా సమావేశం నిర్వహించి సమావేశానికి సంబంధించి వివరాలు చెప్పుకుని ఉంటే వైసీపీకి మరింత క్రెడిట్ పెరిగేది.కానీ జగన్ దీన్ని పట్టించుకోలేదు.
ప్రధాన ప్రతిపక్షం టిడిపి జగన్ కేసుల మాఫీ కోసం ఢిల్లీ పెద్దలను కలిసారని విమర్శలు చేయడం మొదలు పెట్టింది.అయినా జగన్ అదే సైలెన్స్.
ప్రస్తుతానికి ఈ విధానం పెద్దగా ఇబ్బంది లేకపోయినా ముందు ముందు జగన్ కు చేటు తీసుకురావడం మాత్రం తప్పదు.