అమరావతి ! ఏపీ రాజధాని అమరావతి పై గత టీడీపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటం చేసింది.రాజధానికి అది సరైన ప్రాంతం కాదు అని ఎన్ని సూచనలు, సలహాలు వచ్చినా బాబు మాత్రం అమరావతికి నా ఓటు అంటూ రాజధానిని అక్కడ ఏర్పాటు చేశారు.
అప్పటికే అనేక ప్రాంతాలు పరిశీలనకు వచ్చినా వాటిని బాబు పరిగణలోకి తీసుకోలేదు.ఆంధ్రుల స్వప్నం అమరావతి అంటూ బాబు ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యాలయాలు అనేకం నిర్మించేశారు.
అమరావతి చుట్టూ అనేక ఐకాన్స్ ఏర్పాటుకు కృషిచేశారు.ఒకరకంగా చెప్పలంటే బాబు దృష్టంతా అమరావతి మీదే ఫోకస్ చేసాడు.
అయితే ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి రావడంతో రాజధాని మార్పు అంశం తెర మీదకు వచ్చింది.ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని మీద సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాజధానిని మార్చాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
అమరావతి ముంపు ప్రాంతంలో ఉందనీ, భవిష్యత్తులో వరదలు వస్తే నష్టం తీవ్రంగా ఉండే అవకాశం ఉందనే కోణంలో వైసీపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు.అంతేకాదు, అమరావతిని ఎంపిక చేయడం వల్ల ఆ చుట్టు పక్కల భూములు కొనుగోలు చేసిన తెలుగుదేశం నాయకులు మాత్రమే బాగుపడ్డారనీ, పెద్ద అవినీతి జరిగిందనీ, అందుకే వారే ఇప్పుడు ఆందోళన చెందుతున్నారంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో అమరావతి తరలింపు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగేందుకు సిద్ధం అవుతున్నారు.తాజాగా రాజధాని రైతులతో మాట్లాడిన చంద్రబాబు భూముల విషయంలో కూడా తాము పోరాటానికి సిద్ధం అంటూ ప్రకటించారు.
తమతో కలిసి వచ్చే అన్ని పార్టీల మద్దతు తీసుకుంటామన్నారు.సీనియర్ నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి రాజధాని విషయంలో పోరాటం చేసేందుకు అన్ని పార్టీలను కలుపుకు వెళ్తామన్నారు.
మొదటి నుంచి వైసీపీ అమరావతిని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉందని, అంతే కాకుండా ఈ ప్రాంతాన్ని ముంపు ప్రాంతంగా చూపించి దుష్ప్రచారం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు.రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారనీ, ఇక్కడేదో అవినీతి జరిగిపోయిందని ఎంత వెతికినా ఏదీ దొరకదన్నారు.అవినీతిని వెలికి తీస్తామని చెబుతున్న జగన్ సర్కారు అభివృద్ధి కార్యక్రమాలను ఆలస్యం చేస్తోందన్నారు.వంద రోజుల వైసీపీ పాలనపై ఒక పుస్తకం విడుదల చేస్తామని బాబు అన్నారు.
అయితే బాబు చేయబోతున్న పోరాటాన్ని అడ్డుకునేందుకు వైసీపీ కూడా తగిన ప్రణాళికలతో సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.తాజాగా సీఎం జగన్ ఢిల్లీ లో అమిత్ షా తో భేటీ అవ్వడం రాజధాని, పోలవరం విషయాల గురించి చర్చించడంతో దీనిపై జగన్ స్వయంగా స్పందించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.