కొద్ది రోజులుగా తెలంగాణాలో ఒక రాష్ట్ర పోలీసులపై మరో రాష్ట్ర పోలీసులు నిఘా పెట్టడం సంచలనం రేపుతోంది.తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మహా కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ అక్కడ గెలుపు అవకాశాలు సృష్టించుకునేందుకు అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి టీడీపీ అధినేతకు చేరవేసేందుకు రహస్యంగా నిఘా విభాగానికి చెందిన పోలీసులు ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతుండడం తెలంగాణ పోలీసులకు అనేక అనుమానాలు కలిగిస్తోంది.
అందుకే వారి మీద పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారు.
ఏపీ పోలీసులు ఎవరి కంట పడకుండా తమకు అప్పగించిన పని చేసుకెళ్తుంటే తెలంగాణ పోలీసులు వీరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు హెడ్ క్వాటర్స్ కి అందిస్తున్నారు.ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు దాగుడు మూతలు ఆడుతున్నారు. ఇప్పటికే నగరంలోని అనేక హోటళ్లలో ఇప్పటికే మకాం వేసిన ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు.
ఇక్కడి విషయాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారని సమాచారం.ప్రధానంగా నగరంలో అత్యంత రద్దీ ఉండే.
ప్రత్యేకించి పోలీసు, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కీలక కార్యాలయాలు ఉన్న లక్డీకాపూల్ ప్రాంతంలోని ఓ ప్రముఖ హోటల్లోని రూం నంబర్ 122 కేంద్రంగా ఏపీ ఇంటెలిజెన్స్ పనిచేస్తున్నట్టు తెలంగాణ పోలీసులు గుర్తించారని సమాచారం.
తెలంగాణలో ఏపీ నిఘా వర్గాలు దిగాయని నెల క్రితమే సమాచారం వచ్చింది.తెలంగాణ జిల్లాల్లోని రాజకీయ పరిస్థితులేమిటి? టీడీపీ ఉనికి చాటుకోవడానికి ఇంకా అవకాశం ఉన్న ప్రాంతాలేమిటి? మహాకూటమిలో టీడీపీ చేరితే ఎన్ని సీట్లు కోరవచ్చు? అనే అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు తన ఇంటెలిజెన్స్ అధికారులతో ఆరాతీసినట్టు బయటికి పొక్కడంతో పెద్ద దుమారమే రేగుతోంది.ఏపీ పోలీసులు ఇప్పటికే తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో రహస్య సర్వే పూర్తి చేశారని .మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీ దక్కించుకునే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో ఏపీ పోలీసులు రహస్యంగా సంచరిస్తున్నట్టు తెలంగాణ పోలీసులు ప్రభుత్వానికి నివేదిక కూడా అందించినట్టు సమాచారం.