ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి తనకు వచ్చిన సానుభూతిని 2024 ఎన్నికల వరకు కొనసాగించి ప్రజల్లో బలమైన ముద్ర వేసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.దీనిలో భాగంగానే బస్సుయాత్ర నిర్వహించాలని ఫైనల్ గా నిర్ణయించుకున్నారు .
దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఈ యాత్ర కవర్ అయ్యే విధంగా బాబు ప్రణాళికలు రచించారు.వైసిపి ప్రభుత్వం పరిపాలన చేయడంలో విఫలం అయిందని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంక్షేమ పథకాలు ప్రకటించడం తప్ప , ఏపీలో అభివృద్ధి శూన్యం అని ఇప్పటికే చంద్రబాబు తో పాటు, తెలుగుదేశం నాయకులు ఎన్నో విమర్శలు చేస్తున్నారు.
అయితే ఆ విమర్శలు జనాల్లోకి వెళ్లకపోవడంతో బస్సు యాత్ర ద్వారా నియోజకవర్గాల్లోని కీలకమైన ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచేందుకు బాబు బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు జనవరి నుంచి ఈ యాత్రను ప్రారంభించాలని చూస్తున్నారు.
శుక్రవారం జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో దీనిపై చర్చించినట్లు సమాచారం.చంద్రబాబు బస్సు యాత్ర తోపాటు, ఆయన కుమారుడు లోకేష్ పాదయాత్ర చేసే విషయం పైన పార్టీలో చర్చ జరుగుతోంది.2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ద్వారా జనాల్లోకి వెళ్లారు.ప్రతి నియోజకవర్గంలోనూ పాదయాత్ర నిర్వహించి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు .పాదయాత్ర క్రెడిట్ ద్వారానే వైసిపి 2019 లో అఖండ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది.ఇప్పుడు అదే ఫార్ములాను ఉపయోగించి తాను కూడా జగన్ మాదిరిగా పాదయాత్ర నిర్వహించి జనాల్లోను, పార్టీలోనూ పట్టు పెంచుకోవాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ మేరకు చంద్రబాబు నుంచి పాదయాత్ర కు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అలాగే 175 నియోజకవర్గాలకు గాను, వంద నియోజకవర్గాల్లో రెండేళ్లకు ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే వారు జనాల్లోకి వెళ్లి తమ గ్రాఫ్ పెంచుకోవడంతో పాటు , పార్టీని ప్రజలకు చేరువ అయ్యేలా చేస్తారు అనేది బాబు అభిప్రాయంగా ఉందట.